Markfed | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఎరువులను నిల్వ చేయడం, సరఫరాలో ఒకే కంపెనీ మోనోపలీకి చెక్ పెట్టే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎరువుల సరఫరా, నిల్వ కోసం నోడల్ ఏజెన్సీ మార్క్ఫెడ్ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 26వ తేదీ వరకు అవకాశం కల్పించింది. మొత్తం 22 రేక్ పాయింట్స్ వద్ద రైలు ద్వారా వచ్చే ఎరువులను నిల్వ చేసి అవసరమైనప్పుడు జిల్లాలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టెండర్ నిబంధనల ఖరారుకు సంబంధించి ఇటీవల వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ నేతృత్వంలో కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో టెండర్ నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. ఎరువుల సరఫరా, నిల్వ ప్రక్రియలో ఉమ్మడి రాష్ట్రం నుంచి ఒకే కంపెనీ గుత్తాధిపత్యం కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతి సంవత్సరం సదరు కంపెనీకే మొత్తం 22 రేక్ పాయింట్ల టెండర్లు దక్కేవి. ఇందుకు మార్క్ఫెడ్లోని కొందరు అధికారులు ఆ సంస్థకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. సంవత్సరాలపాటు నిబంధనలు మార్చకుండా ఒకే విధంగా టెండర్ ప్రక్రియ కొనసాగించడం వల్లే సదరు కంపెనీ ఈ టెండర్లను దక్కించుకోగలిగిందనే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు నిబంధనలు కఠినతరంగా ఉండటంతో ఇతరులు కనీసం టెండర్ దాఖలు చేసే పరిస్థితి కూడా లేకుండాపోయింది.
దీంతో ఒకే సంస్థ పోటీలో ఉంటడం.. టెండరు ధర కూడా అధిక మొత్తంలో ఉండేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి నిబంధనలు సడలించి ఎక్కువమంది టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. అందులోభాగంగా పలు కీలక అంశాల్లో నిబంధనలను సడలించింది. గతంలో టెండర్లలో పాల్గొనే సంస్థకు కచ్చితంగా ఐదు సొంత లారీలు ఉండాలి. దీన్ని ఐదు లారీల నుంచి మూడు లారీలకు తగ్గించారు. ఇక, ఎరువుల నిల్వ, సరఫరా రెండింటిలో కచ్చితంగా మూడేండ్ల అనుభవం ఉండాలి. దీన్ని సవరించి ఏవైనా బ్యాగ్డ్ మెటీరియల్(ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల బ్యాగులు)లో అనుభవం ఉండాలని సవరించారు. ఇక ఎరువుల నిల్వ, సరఫరా రెండూ ఒకే సంస్థ చేయాలని, ఇందులో కనీసం మూడేండ్ల అనుభవం ఉండాలని నిబంధన ఉంది. దీంతో సదరు ఒకే సంస్థ మినహా మిగిలిన ఏ సంస్థలు కూడా ఈ నిబంధన ప్రకారం ఉండేవి కావు. దీంతో ఎరువుల సరఫరా, నిల్వలో ఏదో ఒక దాంట్లో ఎక్కువ అనుభవం, మరోదాంట్లో తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఆ సంస్థకు టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఇలా పలు కీలక నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల ఎక్కువ సంస్థలు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటికే గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న సంస్థకే ఎక్కువ రేక్ పాయింట్ల టెండర్లు దక్కొచ్చనే చర్చ జోరుగా కొనసాగుతుండడం కొసమెరుపు.