టీఏకే-003ని రూపొందించిన శాస్త్రవేత్తలు
కోల్కతాలో మొదలైన క్లినికల్ ట్రయల్స్
84% ప్రభావవంతం: వైద్య నిపుణులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందు కలవరపాటుకు గురిచేసే డెంగ్యూకు ఇక చెక్ పడనున్నది. దాని నివారణకు త్వరలోనే టీకా అందుబాటులోకి రానున్నది. జపాన్కు చెందిన ఫార్మాసంస్థ ‘టకేడా’ రూపొందించిన ఈ వ్యాక్సిన్ను ప్రస్తుతం ‘టీఏకే-003’గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్ దశలో ఉన్నది. మనదేశంలో ప్రతి సంవత్సరం వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా సగటున 3.3 కోట్ల మంది మంది డెంగ్యూ బారినపడుతున్నారు. మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉంటున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూకు చెక్ పెట్టే టీకాను శాస్త్రవేత్తలు రూపొందించారు. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా దేశవ్యాప్తంగా 480మందిపై టీఏకే-003 టీకా పనితీరును పరిశీలిస్తున్నారు. వీరిలో 70మంది కోల్కతావాసులు ఉన్నారు. దేశంలోనే డెంగ్యూ కేసులు అత్యధికంగా నమోదయ్యే కోల్కతా నగరంలోని నాలుగు దవాఖానల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించినట్లు ప్రముఖ ఫార్మకాలజీ శాస్త్రవేత్త డాక్టర్ రఘురామ్రావు తెలిపారు. కోల్కతాలోని బీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్, స్కూల్ ఆఫ్ ట్రోపికల్ మెడిసిన్, మరో రెండు ప్రైవేటు దవాఖానల్లో ఈ ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలిపారు.
దుష్ప్రభావాలు కలగలేదు
క్లినికల్ ట్రయల్స్కు నాలుగేండ్ల వయసున్న చిన్నారుల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు వివిధ ఏజ్గ్రూప్లను ఎంపిక చేసినట్లు డాక్టర్ రఘురామ్రావు తెలిపారు. డెంగ్యూతో తీవ్ర అనారోగ్యానికి గురై దవాఖానలో చేరిన వారిపై ఈ టీకా 84శాతం ప్రభావవంతంగా పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని పేర్కొన్నారు. టీకా విజయవంతమై పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే డెంగ్యూ జ్వరానికి శాశ్వత పరిష్కారం లభించినట్లేనని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గిపోయి దవాఖానల్లో చేరే రోగుల చికిత్సకు వేల రూపాయల ఖర్చు తగ్గిపోనున్నది.