అశ్వారావుపేట/ అశ్వారావుపేట టౌన్, నవంబర్ 17: అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. నిద్రిస్తున్న సమయంలో జేసీబీలు, పోలీస్ బలగాలతో వచ్చిన అధికారులు నిర్ధాక్షిణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి గుడిసెలు, రేకుల ఇండ్లను నేలమట్టం చేశారు. దీంతో పలు కుటుంబాలు వీధినపడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ గెస్ట్హౌస్, ప్రభుత్వ గో దాము వద్ద సుమారు మూడేళ్లుగా కొంతమంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీపీఐ ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ అవసరాల కోసం గుడిసెలను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.
ఇంతలోనే సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో ఒక్కసారిగా 300మంది సిబ్బందితో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు గుడిసెలపై దాడి చేసి నేలకూల్చారు. ఇళ్లల్లో ఉన్న సామగ్రిని బయటకు విసిరి పారేశారు. ఇంట్లో సామగ్రి తీసుకెళ్తామని ప్రాథేయపడ్డా కనికరించలేదు. చంటిపిల్లలు, వృద్ధులతో చలికి వణుకుతూ పేద కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. గుడిసెల తొలిగింపునకు అడ్డురాకుండా ఆదివారం అర్ధరాత్రి సీపీఐ నాయకులను అరెస్ట్ చేసి దమ్మపేట పోలీస్స్టేషన్కు తరలించారు. పాల్వంచ డీఎస్పీ సతీష్కుమార్ నేతృత్వంలో సీఐ నాగరాజు, తహసీల్దార్ రామకృష్ణ కూల్చివేతలను పర్యవేక్షించారు. నిరుపేదల గుడిసెలను తొలిగించిన అధికారులు వారికి వెంటనే ప్రత్యామ్నాయం చూపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.