హైదరాబాద్,నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ పోకడలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయని, ఎమ్మెల్యేల కొనుగోళ్లతో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు పన్నుతున్నదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఓడిపోయినా.. పలు రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నుతున్నదని.. గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో కూడా అవే ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దౌర్భాగ్యమన్నారు.
బీజేపీ యేతర రాష్ట్రాలపై గవర్నర్ల పెత్తనం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు, సమాఖ్య వ్యవస్థను కాపాడేందుకు భావసారూప్య పార్టీలతో చర్చ లు జరుపుతున్నామని చెప్పారు. జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీలతో కలిసి పనిచేస్తే కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. హిందీని బలవంతంగా రాష్ర్టాలపై రుద్దడాన్ని సీపీఎం వ్యతిరేకిస్తున్నదని, రాజ్యాంగంలోని 22 భాషలకు సమాన ప్రాధాన్యమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.