హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఎస్సీ రిజర్వేషన్లను పెంచాలని, వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ జూన్ 26న మాదిగ సంగ్రామ సభ నిర్వహించనున్నామని మాదిగ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి వెల్లడించారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో సోమవారం నిర్వహించిన మాదిగ సంఘాల జేఏసీ సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడుతూ.. మాదిగల రిజర్వేషన్లను 12 నుంచి 19 శాతానికి పెంచాలని, ఎస్సీ కార్పొరేషన్ను మాల, మాదిగ, ఉపకులాల కార్పొరేషన్గా విభజించాలని కోరారు. మూడెకరాల భూమికి 30 లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ కార్పొరేషన్ యూనిట్లను 20 లక్షలకు పెంచాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ను వెంటనే నియమించాలని కోరారు. మొదటి నుంచి తమను మోసగిస్తూ వస్తున్నదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని, లేని పక్షంలో మాదిగల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. బీసీ కులగణన చేపట్టాలని, గిరిజనులు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, చాకలి, మంగలి కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయా హక్కుల సాధనకు జూన్ 26న మాదిగ సంగ్రామ సభను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు బీఎన్ రమేశ్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటుక రాజు, టీఎంఎస్ఎస్ అధ్యక్షుడు గడ్డ యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్య పాగా నర్సింగరావు, తెలంగాణ మాదిగ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్, కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం, మాదిగ ఉపకులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు చింత రాజలింగం, బుడగ జంగాల హక్కుల దండు రాష్ట్ర అధ్యక్షుడు నూనె సాయన్న, ఎన్డీఎస్ఎస్ జాతీయ అధ్యక్షుడు బాబూరావు, మాదిగ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జేరిపోతుల సాయి, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రమ్య పాల్గొన్నారు.