హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం దివ్యాంగులకూ వర్తింపజేయాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి కోరారు. ఈ విషయమై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమాజంలో వెనుకబడి ఉన్న దివ్యాంగులను ఆదుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. 50 శాతం రాయితీ బస్పాస్ కలిగి ఉన్న దివ్యాంగులకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వానికి పెద్ద భారం కూడా పడదని పేర్కొన్నారు. మహిళలతోపాటు దివ్యాంగులకూ ఉచిత బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మానవీయ కోణంలో అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు.