హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించిన బకాయిలను తక్షణం చెల్లించడమేగాక, పథకాన్ని కొనసాగించాలని దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. శనివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ‘బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు?’ కథనంతో ఆందోళన బాట పట్టాయి. దళిత గిరిజన విద్యార్థులకు ధోకా ఇచ్చేలా గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పాలనలోనే ఇంతటి అవమానకర పరిస్థితులు నెలకొన్నాయని నిప్పులు చెరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బెస్ట్ అవలైబుల్ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం నిధులను చెల్లించడంలేదు. మొత్తంగా స్కీమ్ను రద్దు చేసేందుకు సర్కారు సిద్ధమైందని పాఠశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. తమను స్కీమ్ నుంచి తప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నోటీసులను కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో దళిత, గిరిజన, విద్యార్థి, ప్రజా సంఘాలు ఘాటుగా స్పందించాయి. సర్కార్కు అల్టీమేటం జారీ చేశాయి. స్కీమ్కు సంబంధించిన బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
దళిత, గిరిజనులపై రేవంత్ అక్కసు: పేరెంట్స్ అసోసియేషన్
దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనే లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ సీమ్ను (బాస్) ప్రవేశపెట్టారని, కానీ రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని బాస్ పేరెంట్స్ అసోసియేషన్ మండిపడింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్ మాదిగ, రాష్ట్ర కార్యదర్శి సటావత్ రమేశ్నాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దళిత, గిరిజనులపై అక్కసుతో రేవంత్ ప్రభుత్వం మూడేండ్లుగా నిధులను పెండింగ్ పెట్టిందని నిప్పులు చెరిగారు. సమాజాభివృద్ధికి చేసే కార్యక్రమాలను ఖర్చుగా కాకుండా భవిష్యత్కు పెట్టుబడిగా చూడాలని చెప్పే సీఎం రేవంత్రెడ్డి ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే నిధులను విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.