నార్కట్పల్లి, ఏప్రిల్ 22: తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమ్మనబోలు రహదారిపై సోమవారం రైతులు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి అమ్మనబోలు కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిందని తెలిపారు. పంట చేతికి రాకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం ఆరబెట్టుకొని తీసుకురావాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పడంపై వారు నిరసన తెలిపారు.రెండ్రోజులకోసారి లారీ లోడ్తో ఎగుమతి కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. రోజుకు 4 లారీలతో ఎగుమతి చేస్తే తమకు ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పౌరసరఫరాల అధికారులు తడిసిన పంటను పరిశీలించారు.