హైదరాబాద్, జూలై 31(నమస్తే తెలంగాణ): తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భేటీ అయ్యారు. తెలంగాణ చేపల ఎగుమతులకు సంబంధించిన అవకాశాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా సముద్రపు చేపల ఉత్పత్తి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉపరితల జల వనరుల్లో పెంచే చేపలకు డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. సముద్ర తీరం లేని తెలంగాణలో చెరువులు, కుంటలు, జలాశయాలలో సహజంగా పెరుగుతున్న చేపలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉన్నదని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నదని తెలిపారు.