Harish Rao | తెలంగాణలో అన్ని హామీలు అమలు చేశామని.. ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నాడని హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిన అబద్దాలకు మహారాష్ట్రలో తన్నారని.. ఇప్పుడు అవే అబద్ధాలను ఢిల్లీలో చెబుతున్నాడని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. మొదటి గ్యారంటీ మహాలక్ష్మీ నుంచి చివరి గ్యారంటీ చేయూత దాకా అన్నింటినీ ఎగ్గొట్టాడని అన్నారు. అన్ని హామీలను ఎగబెట్టి, తూతూమంత్రంగా అర గ్యారంటీ మాత్రమే అమలు చేసి అన్నీ చేసేశా అంటే ఎలా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
రేవంత్ రెడ్డి అందరికి పరమాన్నం అని చెప్పి, అధికారంలోకి రాగానే పంగ నామాలు పెడుతున్నడని హరీశ్రావు మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదని.. చివరి హామీ చేయూతకు దిక్కు లేదని హరీశ్రావు విమర్శించారు. మధ్యలో ఉన్న అన్ని హామీలదీ దాదాపు అదే పరిస్థితి అని.. అన్నింట్లో కోతల విధింపే అని అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్లుగా.. జనవరి 26 రాజ్యాంగం అమలు లోకి వచ్చిన రోజున ప్రారంభించే కార్యక్రమాల్లోనూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఇది చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ప్రజలు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారని అన్నారు. పాపం రేవంత్ రెడ్డిది అయితే.. శాపం అధికారులకా అని ప్రశ్నించారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు డబ్బా కొడుతున్నడని మండిపడ్డారు. ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి 55 వేలు ఇచ్చామని అబద్దాలు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. అందులో 44వేల ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లవే అని తెలిపారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు మోసం, నిరుద్యోగ భృతి మోసం, జాబ్ క్యాలెండర్ మోసమని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు అమాయకులు కాదని.. వారు అన్నింటినీ గ్రహిస్తారని హరీశ్రావు అన్నారు. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్కు గుణపాఠం చెబుతారని తెలిపారు.
కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారని ప్రశ్నించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా అని నిలదీశారు. కుల గణన సర్వేను బేస్ చేసుకొని, ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి గ్రామాలకు పంపించారని అన్నారు. ఆన్ లైన్లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని తెలిపారు. ఆ దరఖాస్తులు అన్నింటినీ చెత్తబుట్టలో వేశారని అన్నారు. ప్రజాపాలనలో 11లక్షల దరఖాస్తులు వస్తే ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదని నిలదీశారు. కుల గణన సర్వే చేసేటప్పుడు ఇది ఆప్షనల్ మాత్రమే.. బలవంతం లేదని.. ఇష్టం ఉన్న వారు మాత్రమే పాల్గొనవచ్చని చెప్పారు కదా అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం దాన్ని బేస్ చేసుకొని అర్హులకు రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నరని మండిపడ్డారు. వాయిదా వేసుకుని అయినా సరే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే గ్రామగ్రామన నిరసనలు తప్పవని హెచ్చరించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. అర్హులకు రేషన్ కార్డులు వచ్చే దాకా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.