ఢిల్లీ ‘లోని’ ముఠా సరికొత్త స్కెచ్
బడా షోరూమ్లే టార్గెట్
బ్యాంక్ అధికారులకు టోకరా
ఆన్లైన్, ఫోన్లోనే వ్యవహారం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 : అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు వస్తేనే! ఖరీదైన కంపెనీ షోరూంల పేరుతో బ్యాంకులకు బురిడీ కొట్టిస్తారు. అలా కొట్టేసిన నగదును ఇతర రాష్ర్టాల్లోని ఖాతాలకు బదిలీ చేయించుకొని, పోలీసులు వచ్చేసరికి ఖాతాలను ఖాళీ చేస్తారు. వివరాల్లోకెళితే.. ఢిల్లీలోని లోనీ ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రధాన నగరాలలో ఉన్న ఖరీదైన వాహనాల షోరూంల వివరాలు సేకరిస్తారు. యజమానితో పాటు మేనేజర్ల సమాచారం తీసుకొంటారు. షోరూమ్ ఎగ్జిక్యూటివ్లకు ఫోన్ చేసి విక్రయించే కారు మోడల్స్, ధరలను అడుగుతారు. ఓ కారును కొంటామని చెప్పి, అడ్వాన్స్ పంపేందుకు కంపెనీ లేదా యజమాని సంతకం చేసిన క్యాన్సిల్ చెక్ అడుగుతారు. క్యాన్సిల్ చెక్ ఎందుకని అడిగితే అకౌంట్లో డబ్బు వేసేందుకు ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచీతో పాటు ఇతర వివరాలు అవసరం ఉంటాయని చెప్తారు. అలా క్యాన్సిల్ చెక్ను అస్త్రంగా చేసుకొని ముఠా సభ్యులు శుక్రవారం సైబర్ దోపిడీకి ప్లాన్ చేస్తారు. శని, ఆదివారాల్లో సెలవులు ఉండేలా చూసుకొంటారు. అంతకుముందే ఆన్లైన్ షోరూమ్లకు సంబంధించిన ఓ ఆథరైజేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకొంటారు.
శుక్రవారం రోజు ఓ షోరూమ్ను ఎంచుకొని షోరూమ్కు లింక్ ఉన్న బ్యాంక్ అధికారులకు ఫోన్ చేస్తారు. బ్యాంక్ అధికారులకు షోరూమ్ యజమానిగా మాట్లాడుతున్నట్టు నమ్మిస్తారు. బ్యాంక్ అధికారులు స్పందించగానే తన చెక్ బుక్ అయిపోయింది. అత్యవసరంగా డబ్బులు కావాలి. మీకు సాయంత్రానికి అథరైజేషన్ లెటర్తో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాలను పంపిస్తామని నమ్మిస్తారు. బ్యాంక్ అధికారులకు షోరూమ్కు సంబంధించిన లావాదేవీలు భారీగా ఉండటంతో వారు నిజమేనని భావిస్తారు. బ్యాంక్ అధికారులు ఓకే అనగానే బ్యాంక్ అధికారులను నమ్మించేందుకు క్యాన్సిల్ చెక్ను వారికి వాట్సాప్ చేస్తారు. బ్యాంకు అధికారులు ఓకే అనగానే మరో ఖాతాకు డబ్బు పంపాలని అడుగుతారు. దీంతో బ్యాంక్ అధికారులు సంస్థ ఖాతా నుంచి మరో ఖాతాకు డబ్బును బదిలీ చేస్తారు. బ్యాంక్ అధికారులకు అనుమానం రాకుండా ముఠా సభ్యులు సాయంత్రానికి మరోసారి ఫోన్ చేసి దవాఖానలోనే కొంత బిజీగా ఉన్నా, మీకు సోమవారం ధ్రువీకరణ పత్రాలను పంపుతానని మభ్యపెడతారు. దవాఖానలో ఉన్నాడు కదా అని బ్యాంక్ అధికారులు కూడా ఆ వ్యవహరాన్ని పట్టించుకోరు. సోమవారంలోపు ఈ ముఠా సభ్యులు వారి ఖాతాలకు వచ్చిన నగదును దేశంలోని ఇతర రాష్ర్టాల్లోని వారి ఖాతాల్లోకి మళ్లించి పోలీసులకు దొరక్కుండా తప్పించుకొంటారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు నేరాలకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ‘లోని’ ముఠా నుంచి బ్యాంకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. నేరుగా ధ్రువీకరణ పత్రాలు తీసుకొన్నాకే డబ్బు వ్యవహారాలు చూడాలని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల సైబరాబాద్ పరిధిలోని ఓ షోరూమ్ యజమానిగా ఫోన్ చేసి అతని ఖాతా నుంచి మరో ఖాతాకు దాదాపు రూ. 35 లక్షలు బదిలీ చేయించుకొన్న విషయం తెలిసిందే.