యాదాద్రి: ఆప్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్తో కలిసి ఆలయ గర్భాలంయలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రీశుడిని దర్శించుకుని తరించిపోయారు. అనంతరం కృష్ణ శిలలలో నిర్మించిన ఆలయాన్ని ఆసాంతం ఆసక్తిగా పరిశీలించారు. ఆలయ నిర్మాణ శైలిని చూసి అబ్బురపడిపోయారు. ముఖ్యమంత్రి సంకల్ప బలాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కొనియాడారు. ఆలయాన్ని ఆధునీకరించిన విధానం, ఆలయ విశిష్ఠతలను సీఎం కేసీఆర్ వారికి వివరించారు.
అంతకుముందు ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్కు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళ తాళాలతో ఆహ్వానం పలికారు. గర్భాలయంలో స్వయంభువుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ముఖ్యమంత్రులకు వేదాశీర్వచనం అందించారు. అధికారులు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాలను అందజేశారు.