MLC Kavitha | హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): దేశంలో నారీశక్తిని ఏకంచేసి, మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించేదాకా పోరాటం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా విస్తరించి తమ కాళ్లకింద నేల జారిపోతుందనే భయంతోనే బీజేపీ తమపై ఆరోపణలు చేస్తున్నదని ఆమె ఆరోపించారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని, మోదీకి ప్రత్యామ్నాయం కేసీఆరేనని తేల్చి చెప్పారు. శుక్రవారం ఆమె పలు న్యూస్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను వెల్లడించారు. ఎవరెన్ని కలలుగన్నా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ సీఎం అభ్యర్థి కేసీఆరేనని కవిత కుండబద్దలు కొట్టారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ధర్నా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాల్లో మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తున్న వాళ్లను ఈ ధర్నాకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతు తమకు ఉందని తెలిపారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకపోతే దేశం ఎలా విశ్వగురు అవుతుందని ప్రశ్నించారు. లోక్సభలో బీజేపీకి 303 మంది ఎంపీలు ఉన్నారని, ఆ పార్టీ తలచుకొంటే ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకొని బిల్లు తేవచ్చని చెప్పారు.
తనపై వచ్చిన లిక్కర్ స్కామ్ ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొంటానని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ ఇలా ఏ రకమైన ఏజెన్సీలు వచ్చినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బీజేపీ నాయకుల ఆరోపణలకు అదిరేది లేదు.. బెదిరేది లేదని స్పష్టం చేశారు. చట్టాలు, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉన్నదని చెప్పారు. ‘బీజేపీ దేశానికి ఏం చేసింది? మోదీ ప్రధాని అయ్యాక వివిధ రంగాల్లో దేశ ప్రతిష్ఠ ఏ మేరకు పతనమైంది? అనేది దేశం చూస్తున్నదని చెప్పారు.
దేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ఇష్టారీతిగా అమ్ముతూ మోదీ సేల్స్మన్గా మారారని, సంపద సృష్టించి ప్రజల జీవితాలను మారుస్తూ కేసీఆర్ రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీజేపీ అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెస్తామని కేసీఆర్ చేసిన సంచలన ప్రకటన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నదని తెలిపారు. బీజేపీ వైఫల్యాలను దేశవ్యాప్తంగా ఎండగడుతామని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం అబద్ధాలతో ప్రజలను బురిడీకొట్టిస్తున్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీది అభివృద్ధి నినాదం అయితే.. బీజేపీది అబద్ధపు విధానమని పేర్కొన్నారు. అబద్ధాలు ఎంతోకాలం నిలబడవని, దేశానికి మంచి చేయాలనే బీఆర్ఎస్ను ప్రజలనుంచి ఎవరూ దూరం చేయలేరని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడోసారికూడా అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తంచేశారు. తమ సీఎం అభ్యర్థి కేసీఆరేనని స్పష్టం చేశారు. పార్టీ అధినేతగా కేసీఆర్ తమకు ఏ బాధ్యత ఇచ్చినా సైనికులుగా పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ అనుసరించే వ్యూహం ఏమిటి? అనే విషయంలో తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని కవిత స్పష్టంచేశారు.