హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో డిగ్రీ సీట్లకు మళ్లీ కోత పడబోతున్నది. ఒక్క ఫస్టియర్లోనే దాదాపు 2 లక్షల సీట్లు తగ్గనున్నాయి. అంటే సగం సీట్లు కోల్పోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో 965 డిగ్రీ కాలేజీలు, 4,40,107 సీట్లు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 2,05,140 సీట్లు(46శాతం) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏకంగా 2,34,967 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే సగం సీట్లు కూడా నిండని పరిస్థితి. ఈ నెల 14లోపు ఇంటర్ ఫలితాలు విడుదలకానున్నాయి. మూడో వారంలో డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదల కానున్నది. భర్తీకాని సీట్లను తగ్గించిన తర్వాతే దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు. సోమవారం దోస్త్పై కీలక సమావేశం జరిగింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం, భర్తీకాని సీట్లను తగ్గించే అంశంపైనే చర్చ జరిగింది. అయితే, ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు 160 కాలేజీలు ఆసక్తి చూపించాయి. వీటికి అదనపు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పటికే ఉన్న సీట్లను రద్దుచేసుకుంటేనే కొత్త సీట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇక జీరో అడ్మిషన్ కాలేజీలు, 15 మంది/15 శాతం అంతకంటే తక్కువ సీట్లు నిండిన కాలేజీలను కూడా పక్కనబెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చారు. ఇంటర్ సెకండియర్లో ఏటా 3.3 లక్షల మంది మాత్రమే ఉత్తీర్ణులవుతున్నారు. కానీ, డిగ్రీ ఫస్టియర్లో4.4లక్షల సీట్లకు అనుమతిచ్చారు. ఇంజినీరింగ్, ఫార్మసీలో చేరినవారు మినహా ఏటా రెండు లక్షల మంది మాత్రమే డిగ్రీలో చేరుతున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో జీరో అడ్మిషన్ కాలేజీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. 2025-26 విద్యాసంవత్సరంలో 64 డిగ్రీ కాలేజీల్లో ఒక్కరు కూడా చేరలేదు. వీటిలో 63 ప్రైవేట్, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఉన్నది. యూనివర్సిటీల వారీగా తీసుకుంటే అత్యధికంగా కాకతీయ పరిధిలో 22, ఎంజీయూ పరిధిలో 14, ఉస్మానియా 13, పాలమూరు 5,శాతవాహన 2 ఉన్నాయి.
డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల ఆలోచనలు మారుతున్నాయి. రూరల్ కాలేజీల్లో చేరడం లేదు. ముఖ్యంగా అర్బన్, గ్రేటర్లోని కాలేజీల్లోనే చేరుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా హైదరాబాద్ సహా పెద్ద నగరాల్లో చదివేందుకు ఇష్టపడుతున్నారు. పట్టణాల్లో చదివితే ఉన్నతస్థానాలు చేరవచ్చనే ఆలోచనతో విద్యార్థులు గ్రేటర్కు క్యూ కడుతున్నారు. జీరో అడ్మిషన్, సీట్లు నిండని కాలేజీలను పరిశీలిస్తే దాదాపు అన్ని గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఫలితంగా మండల, నియోజకవర ్గకేంద్రాల్లోని డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతున్నది.

