నారాయణపేట : చూడముచ్చటైన అందంతో చురుగ్గా కదులుతూ చెంగు చెంగున గంతులేస్తూ పరిగెడుతుంతే ఎలాంటి వారైనా వాటి విన్యాసాలకు ముగ్ధులవ్వాల్సిందే. వాటి సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు సైతం పోటీ పడుతుంటారు. అలాంటి కనువిందు చేసే కృష్ణ జింకలు(Deer )మక్తల్ నియోజకవర్గ(Maktal constituency) రైతుల పాలిట మాత్రం శాపంగా మారాయి. వాటి అందాలు దేవుడెరుగు.. పంటలకు నష్టం చేయకుంటే చాలు అంటున్నారనంటే అవి అన్నదాతలను ఎంతలా ఇబంది పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ జింకలు రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భారీ స్థాయిలో వాటి సంతతి పెరిగిపోవడం వల్ల పంటలు సాగు చేసుకున్న రైతన్నలు కృష్ణ జింకల అలజడితో బెంబేలెత్తిపోతున్నారు. రాత్రింబవళ్లు పొలాలగట్లపై నిద్ర కాస్తూ జింకల బెడద నుంచి తమ పంట పొలాలను(destroying crops) కాపాడుకుంటున్నారు. మక్తల్ మండలం మాగనూరు మండలం కృష్ణ మండలాల్లో కృష్ణ జింకల బెడద తీవ్ర స్థాయిలో ఉన్నందువల్ల రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి.
జింకల సంతతి భారీ స్థాయిలో పెరిగిపోవడం వల్ల ఒక్కో గుంపులో వంద నుంచి 150 జింకలు వచ్చి పంట పొలాల పై దాడి చేయడంతో రైతన్నలు పంట సాగు చేసుకోవాలంటేనే భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. కృష్ణ జింకల దాడి నుంచి రైతన్నలకు ఉపశమనం కలిగే విధంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని రైతులు వేడుకుంటున్నారు.