కూసుమంచి (నేలకొండపల్లి), జూన్ 2 : ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరులేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాలో చోటుచేసుకున్నది. తండాకు చెందిన ధరావత్ కేశ్యా కూలి పనులు చేసుకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించుకుంటున్నాడు. రేకులషెడ్లో నివసిస్తున్న అతడు ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని జాబితాలో పేరు వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు.
ఈ క్రమంలో అధికారులు సోమవారం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన కేశ్యా.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పక్కనే ఉన్నవారు, అధికారులు కలుగజేసుకొని నచ్చజెప్పారు. అన్ని అర్హతలున్నా ఇండ్ల జాబితాలో పేరు లేకపోవడం ఏమిటని, ఆస్తులు బంగ్లాలు ఉన్న వారికే ఇండ్లు మంజూరు చేస్తారా? మా లాంటి నిరుపేదలు మీకు కనిపించరా? అంటూ అధికారులను ప్రశ్నించాడు. రేకుల షెడ్డును చూసైనా ఇల్లు మంజూరు చేయాలని వేడుకున్నాడు.