Deeksha Divas | హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు అన్నారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు నవంబర్ 29కి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎత్తిన జెండా దించకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్కు దకుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తేలేకపోతే రాళ్లతో కొట్టిచంపండి అని ధైర్యంగా చెప్పింది కేసీఆర్ అని గుర్తుచేశారు.
ఆమరణ నిరాహారదీక్షతో ప్రాణాలు సైతం లెకచేయకుండా కేసీఆర్ తెగించి పోరాడి తెలంగాణ సాధించారని చెప్పారు. ఈ క్రమంలోనే నవంబర్ 29న ప్రతి సంవత్సరం తెలంగాణలో దీక్షా దివస్ను జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సంవత్సరం సైతం దీక్షా దివస్ను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకున్నదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట స్ఫూర్తిని దీక్షా దివస్ ద్వారా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు.