సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణుల కోసం ప్రత్యేక 24X7 సహాయ కేంద్రం.. వ్యాయామా లు చేయించటం.. హైరిస్క్ గర్భిణులను గుర్తించి అలర్ట్ చేయటం.. సమాచారశాఖ ఆధ్వర్యంలో చైతన్య కార్యక్రమాలు.. ఇలాంటి పటిష్ఠ చర్యలతో రాజన్న సిరిసిల్లలో సిజేరియన్లకు కత్తెరపడి, సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ అనురాగ్ జయంతి, వైద్యారోగ్యశాఖ సిబ్బంది పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తూ, జిల్లాలో గర్భిణుల ‘కడుపు కోత’కు చెక్ పెడుతున్నారు.
కరీంనగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా సాధారణ ప్రసవాలకు చిరునా మాగా నిలుస్తున్నది. గర్భిణులకు అవగాహన కల్పిస్తూ, వైద్య సదుపాయాలను పటిష్ఠం చేయటంతో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్స రంలో జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో 60.7 శాతం సాధారణ ప్రసవాలే దీనికి నిదర్శనం. మొత్తం 346 తొలి కాన్పులు జరగ్గా, కేవలం 125 సిజేరియన్లు అయ్యాయి. రానున్న రోజుల్లో 80 శాతం సాధారణ ప్రసవాలే లక్ష్యంతో అధికారులు కృషి చేస్తున్నారు.
క్షేత్రస్థాయి నుంచే అవగాహన
సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు పటిష్ఠమైన ప్రణాళికలతో జిల్లా యంత్రాగం ముందుకు వెళ్తున్నది. సాధారణ ప్రసవానికి దోహదపడే వ్యాయామాలపై వైద్యారోగ్యసిబ్బంది, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణు లకు అవగాహన కల్పిస్తున్నది. ‘గర్భిణుల వివరాలు నమోదుచేసుకొని అధిక ప్రమాదం ఉన్న గర్భిణులను గుర్తిస్తున్నాం. సీ-సెక్షన్ల వల్ల కలిగే అనర్థాలను చెప్తు న్నాం. రెగ్యులర్ చెకప్లతో జనన ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం’ అని జిల్లా దవాఖాన పర్యవేక్షకుడు డాక్టర్ మురళీధర్రావు పేర్కొన్నారు.
జిల్లా కేంద్ర దవాఖానలో అధునాతన వసతులు
సిరిసిల్ల జిల్లా దవాఖాన ఇప్పటికే కాయకల్ప అవార్డ్ అందుకొన్నది. లోపాలతో జన్మించే పిల్లల సంరక్షణ, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఇక్కడ సిక్ న్యూబార్న్ కేర్ యూనిట్, న్యూట్రిషనల్ రిహాబి లిటేషన్ సెంటర్లు ఉన్నాయి. శిశువులు వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో శిశు మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నది.
24X7 సహాయ కేంద్రం
గర్భిణులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు 24X7 పనిచేసేలా ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 9030566108 నంబరును అందుబాటులో ఉంచారు. ఇందుకోసం బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన ఇద్దరిని ప్రత్యేకంగా నియమించారు.
సమాచార శాఖ చైతన్య కార్యక్రమాలు
కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శనం మేరకు సమాచార, పౌర సంబంధాలశాఖ.. ‘సాధారణ ప్రసవాలే అన్ని విధాలుగా మేలు – సిజేరియన్లకు కత్తెరేద్దాం’ పేరుతో 8 నిమిషాల నిడివి గల సందేశాత్మక వీడియో డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ షార్ట్ ఫిల్మ్లో సిజేరియన్ల వల్ల తల్లీబిడ్డకు జరిగే ఆరోగ్య నష్టాలు, ఎదురయ్యే ప్రమాదాలను పొందుపరిచామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఈ వీడియోను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించి, చైతన్యవంతులను చేస్తున్నామని వివరించారు.
సాధారణ ప్రసవం కోసమే వచ్చా
సాధారణ ప్రసవం కోసమే జిల్లా దవాఖానకు వచ్చా. మొదటి నుంచి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొన్నా. వైద్య సిబ్బంది బాగా చూసుకొన్నారు. సాధారణ ప్రసవంపై స్టాఫ్ నర్సు అవగాహన కల్పించారు. దవాఖానలో వ్యాయామం చేయించడంతో ధైర్యం వచ్చింది. ప్రసవ సమయంలో పురిటి నొప్పుల బాధ పెద్దగా తెలియలేదు. కేసీఆర్ కిట్ అందించారు.
– మానస, సిరిసిల్ల