హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): కొవిడ్ -19 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల హాజరును ప్రభావితం చేసింది. పాఠశాలలు పునఃప్రారంభించిన తర్వాత ఒకటి, రెండో తరగతి విద్యార్థుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు బడికి డుమ్మా కొడుతున్నట్టు తేలింది. సర్కారు బడుల్లో 36.8 శాతం, ప్రైవేటు స్కూళ్లలో 33.6 శాతం మంది చిన్నారులు బడికి రావట్లేదు. ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఏఎస్ఈఆర్) 2021 నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేటతెల్లమైంది. దేశంలోని 25 రాష్ర్టాల్లో 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఈ సర్వే నిర్వహించారు. కొవిడ్ కారణంగా ఇంటి దగ్గర ఉండి చదువుకున్న ఐదేండ్ల నుంచి 16 ఏండ్ల వయసు విద్యార్థులపై సర్వే చేశారు. మొత్తం 75,235 మంది విద్యార్థులు, 7,299 మంది ఉపాధ్యాయులు సర్వేలో పాల్గొన్నారు.