TG TET 2024-II | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)పై ఏటా ఆసక్తి తగ్గుతున్నది. టెట్ 2024కు ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2022లో 4.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, 2023లో 2.86 లక్షల దరఖాస్తులొచ్చాయి. గతంలో ఒకసారి ఏకంగా 6.28 లక్షల మంది దరఖాస్తు చేశారు. టెట్ దరఖాస్తుల గడువు 20వ తేదీతో ముగియనుంది. శనివారం వరకు టెట్ పేపర్-1కు 39,741, పేపర్-2కు 75,712, రెండు పేపర్లకు 10,599 చొప్పున మొత్తంగా 1,26,052 దరఖాస్తు చేసుకున్నారు. ఇది వరకు టెట్ నిర్వహించినప్పుడల్లా 4-6 లక్షల మంది దరఖాస్తు చేసేవారు. నిరుద్యోగులతోపాటు ఈ ఏడాది నుంచి కొత్తగా సర్వీస్ టీచర్లు టెట్కు హాజరవుతున్నారు.
పదోన్నతులకు టెట్ తప్పనిసరి కాగా టీచర్లు సైతం టెట్ రాయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో టెట్కు హాజరయ్యే వారి సంఖ్య పెరగాలి. కానీ అభ్యర్థుల నుంచి స్పందన అంతంత మాత్రంగా ఉంటున్నది. టెట్ వ్యాలిడిటీ గతంలో ఏడేండ్లు ఉండగా, దీనిని జీవితకాలం పొడిగించారు. దీంతో గతంలో టెట్ క్వాలిఫై అయిన వారు మళ్లీ టెట్ రాసేందుకు ఆసక్తిచూపడంలేదు. దరఖాస్తు చేసేందుకు మరో మూడు రోజులుండటంతో ఈ సంఖ్య పెరుగుతుందని అధికారులంటున్నారు. టెట్ దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు 22 వరకు ఎడిటింగ్కు అవకాశం ఇచ్చినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నర్సింహారెడ్డి తెలిపారు. అభ్యర్థులు www. schooledu. telagana. gov.in. వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 7032901383, 90007561 78 నంబర్లను సంప్రదించాలని సూచించారు.