హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): గ్రూప్1 నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, నిబంధనల మేరకే పరీక్ష నిర్వహించామని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) స్పష్టంచేసింది. అభ్యర్థుల సంఖ్య విషయంలో అపోహలు సరికాదని తెలిపింది. బయోమెట్రిక్ విధానం, 258 పేపర్లు అదనంగా పెరిగాయన్న ఆరోపణలపై గురువారం వివరణ ఇచ్చింది. అభ్యర్థుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేసింది. బయోమెట్రిక్ విధానం కేవలం ప్రయోగాత్మకంగా మొదటిసారి పరీక్షలో ప్రవేశపెట్టామని, తొలిసారి కొందరు ఇబ్బంది పడటం, సమయం వృథాకావడం తదితర కారణాల దృష్ట్యా రెండోసారి అమలు చేయలేదని తెలిపింది. యూపీఎస్సీ కూడా బయోమెట్రిక్ను అమలు చేయడం లేదని గుర్తుచేసింది. బయోమెట్రిక్ అమలు చేయనప్పటికీ.. మూడంచెల విధానంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించామని వెల్లడించింది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగిందని, అదేరోజు సాయంత్రం కలెక్టరేట్ల ద్వారా అందిన సమాచారం ప్రకారం హాజరైన అభ్యర్థులు ప్రాథమికంగా 2,33,248 మంది అని ప్రకటించామని పేర్కొన్నది. ఆ తర్వాత ఓఎంఆర్ పత్రాల స్కానింగ్ ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థుల తుది సంఖ్య 2,33,506గా వెల్లడించినట్టు టీఎస్పీఎస్సీ వివరించింది. పరీక్ష జరిగిన రోజున ప్రకటనలోనే ఇది తాత్కాలిక సమాచారం మాత్రమేనని, సమగ్రమైన సమాచారం మళ్లీ ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నట్టు గుర్తు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని 994 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించామని, ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావివ్వలేదని టీఎస్పీఎస్సీ స్పష్టంచేసింది. చిన్నపాటి వ్యత్యాసాన్ని పెద్దదిగా చేసి చూడొద్దని కోరింది. అభ్యర్థులు ఆందోళన చెందొద్దని తెలిపింది. అయితే.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్లింది. సింగిల్ జడ్జి తీర్పునే డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నది. డివిజన్ బెంచ్ తీర్చును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కమిషన్ సిద్ధమవుతున్నది.