హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చేపట్టబోయే ఉద్యోగ నియామకాలకు వయోపరిమితిని 46 నుంచి 51 ఏండ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్థులు సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి 4 వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రూప్-1 సర్వీసు పోస్టులకు ఫిబ్రవరి 19న జారీచేసిన చేసిన నోటిఫికేషన్తోపాటు మున్ముందు వెలువరించే ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తీక్ బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్రంలో 2017 నుంచి ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కాలేదని, ఈ నేపథ్యంలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని కోరుతూ ఈ నెల 2న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. దీంతో పిటిషనర్ల వినతిని పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు.. ఈ పిటిషన్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.