రయ్యిన దూసుకొచ్చిన వందల డ్రోన్లు.. మిరుమిట్లు గొలిపే కాంతులతో ఆకాశంలో ఏదో చిత్రాన్ని గీస్తున్నట్టు అటూ ఇటూ తిరిగాయి. ఆ విచిత్రం ఏంటబ్బా అని అటు చూసేలోపే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చిత్రం.. ఆ వెంటనే జై తెలంగాణ, జై భారత్, సైబరాబాద్ పోలీస్, షీటీమ్స్, కాళేశ్వరం ప్రాజెక్టు తదితర లోగోలను డ్రోన్లు గాలిలోనే గీసేశాయి. ఈ అద్భుత సన్నివేశాలకు దుర్గం చెరువు వేదికైంది.
Suraksha Dinotsavam | కొండాపూర్, జూన్ 4: మాదాపూర్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై దశాబ్ది వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 500 డ్రోన్లతో నిర్వహించిన షో చూపరులను కట్టిపడేసింది. ఒకేసారి వందల డ్రోన్లు దుర్గం చెరువుపై ఎగురుతూ చీకట్లను తరిమికొట్టాయి. కారు, సీఎం కేసీఆర్, జై భారత్, జై తెలంగాణ, సచివాలయం, యాదాద్రి, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, అంబేద్కర్ విగ్రహం, పోలీస్ ఇమేజ్ టవర్స్, షీటీమ్స్, సైబరాబాద్ పోలీసు లోగోలను ప్రదర్శించి అబ్బురపరిచాయి.
సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ షోకు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు డ్రోన్ షో కొనసాగింది. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్కుమార్, ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే వివేకానంద తదితరులు పాల్గొన్నారు. డ్రోన్ షో ద్వారా తెలంగాణ సాధించిన పురోగతిని, అభివృద్ధిని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారంటూ సైబరాబాద్ పోలీసు బృందాన్ని మంత్రి కేటీఆర్ అభినందించారు.