సిద్దిపేట/కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడుతూ పంద్రాగస్టు లోపల సిద్దిపేటలో లక్షమందితో సభ పెట్టి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని, హరీశ్రావు రాసిపెట్టుకోవాలని సూచించారు.
ఆసిఫాబాద్ రోడ్షోలో రేవంత్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. కులాలు, మతాల పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని, భారత రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ సుల్తానులా తయారైన మోదీ, అమిత్షాకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. రిజర్వేషన్లపై బీజేపీని నిలదీస్తే తనపై ఢిల్లీ పోలీసులతో కేసులు పెట్టించారని, ఇలాంటి కేసులకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెదక్, ఆసిఫాబాద్లో నిర్వహించిన సీఎం రోడ్షోకు జనం అంతంత మాత్రంగానే హాజరయ్యారు.
విద్యుత్ సిబ్బంది పాట్లు
సిద్దిపేటలో రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్షో సందర్భంగా కరెంటు పోకుండా విద్యుత్తుశాఖ సిబ్బంది పలు జాగ్రత్తలు తీసుకున్నారు. కరెంటు పోతే తమ ఉద్యోగాలు కూడా పోతాయన్న భయంతో ఎస్ఈ మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు మొత్తం సభ వద్దే ఉండి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకున్నారు. సభ సజావుగా ముగియడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
సీఎం రేవంత్ రోడ్షో సందర్భంగా బాబూ జగ్జీవన్రావు విగ్రహం నుంచి పాత బస్టాండ్ వరకు ట్రాఫిక్ను మళ్లించడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్షో ప్రారంభానికి గంటన్నర ముందే ట్రాఫిక్ను డైవర్ట్ చేయడంతో వాహనదారులు అష్టకష్టాలుపడ్డారు.