పెబ్బేరు, మార్చి 2 : దశాబ్దాల కిందట చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు జీవో 98 ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాల్సి ఉన్నా.. అమలు కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తూ.. వయస్సు కూడా మీరిపోతుండటంతో ఆందోళనకు గురవుతూ పలువురు నిర్వాసితులు అసువులు బాస్తున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలో మరొకరు మృతిచెందారు. పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామానికి చెందిన దళిత పైగేరి కురుమన్న (55) శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితుడిగా ఉద్యోగానికి అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్నా అవకాశం దక్కలేదు. జీవో 98తో ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉండగా.. నాటి ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేదు.
ఇందుకోసం ఆయన సహచర నిర్వాసితులతో కలిసి ఎన్నో ఆందోళనల్లో పాల్గొన్నాడు. నిరంతరం మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి ఉద్యోగ సాధన కోసం తీవ్రంగా శ్రమించినా ఆయనకు ఉద్యోగం దక్కలేదు. దీంతో తీవ్ర నిరాశ చెందిన ఆయన సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే అస్వస్థతకు గురవగా.. దవాఖానకు తరలించేలోగా కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ముంపు నిర్వాసితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి తమకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు.