RDS | అయిజ, జనవరి 8 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట డెడ్ స్టోరేజీకి చేరుకున్నది. ఎగువ నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో ఆర్డీఎస్ ఆనకట్ట అడుగంటింది. దీంతో శనివారం ఆర్డీఎస్ ప్రధానకాల్వకు చుక్కనీరు చేరలేదు. టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్, కేసీ కెనాల్ జాయింట్ ఇండెంట్ నీటిని ఈ నెల 5న కర్ణాటకలోని ఎల్ఎల్సీ గుండ్లకేరీ ఎస్కేప్ల 4 వేల క్యూసెక్కులను విడుదల చేస్తుండగా, ఆదివారం ఉదయం ఆనకట్టకు చేరుకునే అవకాశం ఉందని ఆర్డీఎస్ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆనకట్టకు నీళ్లు చేరగానే ప్రధానకాల్వకు నీటిని విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు సకాలంలో నీళ్లు చేరకపోతే ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆనకట్టకు నీళ్లు చేరగానే పంటలకు విడుదల చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు డ్యాం ద్వారా నీటిని చేస్తుండటంతో నీటి మట్టం తగ్గుతోంది. వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు 20 టీఎంసీలను నిల్వ చేసే అవకాశం ఉందని టీబీ బోర్డు అధికారులు చెబుతున్నారు. మరో నాలుగైదు టీఎంసీల వరకు డ్యాం నుంచి విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. శనివారం అవుట్లో 10,051 క్యూసెక్కులు ఉంది. 105,788 టీఎంసీల గరిష్ట సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 27.345 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి గాను, ప్రస్తుతం 160413 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.