హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కందుకూరులో విషాదం చోటుచేసుకొన్నది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. కొందరు పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా ఇద్దరు మహిళలు సహా ఎనిమిది మంది మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు సభను అర్ధాంతరంగా నిలిపివేసి దవాఖానకు వెళ్లి బాధితులను పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు విద్యాసంస్థల్లో ఉచితంగా చదివిస్తామని హామీ ఇచ్చారు.