గజ్వేల్/తొగుట, జూలై 25: మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా ఉన్నదని, కాళేశ్వరం వంటి ప్రాజెక్టు తమకూ ఉంటే బాగుపడేటోళ్లమని మహారాష్ట్ర సర్పంచ్లు అభిప్రాయపడ్డారు. ‘మా మహారాష్ట్రలో గోదావరి ప్రవహిస్తున్నా పంట పొలాలకు నీళ్లు రావడం లేదు. కరువు కాటకాలతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో వందల కిలోమీటర్లు కాళేశ్వర జలాలను తీసుకెళ్లి సాగు నీరందిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా నిండిన చెరువులు, కుంటలు, వాగులే కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతోనే ఇదంతా సాధ్యమైంది’ అని బృందం సభ్యులు అనిల్ పాటిల్, అక్షయ్కుమార్, నందలాల్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం దేశానికి రోల్ మాడల్ అని చెప్పుకొంటున్న గుజరాత్ మాడల్ ఫెయిల్ అయిందని, దేశానికి రోల్ మాడల్గా నిలిచిన తెలంగాణ అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నదని కితాబునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండ మిషన్ భగీరథ వాటర్ప్లాంట్, సమీకృత కూరగాయల మార్కెట్, కొండపాక మండలం మంగోల్లో మిషన్భగీరథ మంచినీటి శుద్ధ్దీకరణ కేంద్రం, తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును వారు సందర్శించారు. మల్లన్నసాగర్ ఎస్సీఈ బస్వరాజ్ కాళేశ్వరం ప్రాజెక్టు మ్యాప్ను చూపిస్తూ ప్రాజెక్టు విశేషాలను సర్పంచ్ల బృందానికి వివరించారు.
మేడిగడ్డ వద్ద మొదలైన ప్రాజెక్టు 10 పంప్హౌస్ల ద్వారా వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి కాళేశ్వరం నీటిని తీసుకువచ్చిన్నట్టు తెలిపారు. మల్లన్నసాగర్ పంపుహౌస్ ద్వారా 1.25లక్షల ఎకరాలకు, కొండపోచమ్మసాగర్ ద్వారా 2.85 లక్షల ఎక రాలకు సాగునీరు అందుతున్నట్టు తెలిపారు. అంత దూరం నుంచి గోదావరి నీళ్లను ఇంత ఎత్తుకు తీసుకువచ్చి నిల్వ చేయడంపై మహారాష్ట్ర ప్రజాప్రతినిధుల బృందం సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం మహారాష్ట్ర సర్పంచ్లు సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వల్పకాలంలోనే అభివృద్ధిలో దేశానికి మాడల్గా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇంటింటికీ అందించిన మంచినీళ్లు, అందుకోసం చేపట్టిన వాటర్ప్లాంట్లను చూస్తే అద్భుతంగా అనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇక్కడి అభివృద్ధ్దిని చూస్తే ముచ్చటేస్తున్నదని, ఇలాంటి అభివృద్ధి దేశ ప్రజలకు కావాలంటే కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని స్పష్టంచేశారు. రైతులకు సాగునీరు అందజేయడంతో పచ్చనిపంటలు పండించుకునే వీలును కల్పించిన కేసీఆర్ ఎప్పటికీ రైతుల మనస్సులో నిలిచిపోతారన్నారు. ఇక్కడ రోడ్లు ఎంతో బాగున్నాయని, అడవుల పెంపకం, శుద్ధ్దిచేసిన మంచినీళ్లను ఇంటింటికీ ప్రతిరోజు అందించే పథకాలను చూసి ఫిదా అయ్యామని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్ఈ వేణు, డీఈ శ్రీనివాస్, గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రామమౌళి, మిషన్ భగీరథ ఎస్ఈ శ్రీనివాస్, డీఈ నాగర్జున తదితరులు ఉన్నారు.