యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో ఇప్పుడు వీధి లైట్లు రాత్రి కాగానే వాటంతట అవే వెలిగి, ఉదయం కాగానే ఆరిపోతున్నాయి. అద్భుత ఆవిష్కరణలకు పెట్టింది పేరైన వరంగల్ జిల్లా గోపాలపురానికి చెందిన ముప్పారపు రాజు, సీఎం దత్తత గ్రామంలో కూడా తన ప్రయోగాన్ని విజయవంతం చేశారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ ప్రయోగంతో ఇప్పటికే ఎన్నో పంచాయతీలు విద్యుత్తు వృథాను అరికడుతున్నాయి. రాజు చదివింది డిగ్రీయే అయినా.. సాంకేతిక పరికరాల ఆవిష్కరణలో పెట్టింది పేరు. స్వతహాగా ఎల్డీఆర్ (లైట్ డిపెండెంట్ రెసిస్టర్) తయారుచేసి, దానికి ‘నేచురల్ స్ట్రీట్లైట్ కంట్రోల్ సిస్టం’ అని పేరు పెట్టాడు.
ఈ పరికరంతో సొంత గ్రామంలోనే మొదట వీధి దీపాలు వాటంతట అవే వెలిగి, ఆరిపోయేలా ఏర్పాటుచేశారు. దాంతో రోజూ రెండుమూడు గంటలపాటు విద్యుత్తు ఆదా కావడంతో నెలకు రూ.10వేల వరకు విద్యుత్తు బిల్లు తగ్గుతున్నది. ఇప్పటివరకు 50 గ్రామాల్లో ఈ సెన్సార్లను అమర్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రోద్బలంతో వాసాలమర్రిలో కూడా ఎల్డీఆర్ సిస్టంను అమర్చారు. దీనివల్ల విద్యుత్తు బిల్లు రూ.10 వేల వరకు తగ్గిందని గ్రామ పెద్దలు చెప్పారు.