హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి అక్రమంగా మందులు తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్న పలు దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా మందులు తెచ్చి 40 శాతం డిసౌంట్లో ఇంజక్షన్లు అమ్ముతున్నట్టు గుర్తించారు. మొత్తం 6 హోల్సేల్ మెడికల్ షాపులపై కేసు నమోదు చేసి రూ.51 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు.
సికింద్రాబాద్లోని దుర్గా హబ్ మెడికల్ షాప్, ఉప్పల్లోని శ్రీతిరుమల ఫార్మా మెడికల్ షాప్, సుల్తాన్బజార్లోని శ్రీపరాస్ మెడికల్ ఏజెన్సీస్, నాగోల్లోని శ్రీగణేశ్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, కాప్రాలోని శ్రీరాజరాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్, కాచిగూడలోని శ్రీబాలాజీ ఏజెన్సీస్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో సలాం బిన్ మహ్మద్ మిస్రీ ఇంటిపై దాడి చేసిన డీసీఏ అధికారులు.. ఎలాంటి లేబుల్ లేని 50 ఇంజక్షన్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆక్సిటోసిన్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు వీటిని అక్రమంగా పశువులకు వినియోగిస్తున్నట్టు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మలాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండల కేంద్రంలో డీసీఏ అధికారులు గోదాంపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన రూ.23 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు.