Weather Update | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అంతర్భాగం మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉంది. ఈ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు, అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
రానున్న 48 గంటల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమైంది. జంటనగరాల్లో సాయంత్రం వేళలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, కామారెడ్డిల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.