BJP | స్పెషల్ టాస్క్ బ్యూరో: హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందట.. ఆలూ లేదు చూలూ లేదు కొడుకుపేరు సోమలింగం అన్నాడట వెనుకటికి ఒకడు’.. రాష్ట్ర బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై ఇలాంటి సామెతలు ఎన్నయినా చెప్పొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీలో రోజురోజుకూ పెరిగిపోతున్న వర్గ విబేధాలను చల్లబర్చేందుకు అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తీసేసి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని నియమించి అధిష్ఠానం అలా ఊపిరి పీల్చుకొన్నదో లేదో.. పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని అంటున్నారు బీజేపీ వ్యవహారాలను దగ్గరి నుంచి గమనిస్తున్న రాజకీయ పండితులు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో పార్టీ ఉంటే.. ఎన్నికల తర్వాత ‘నేనే సీఎం క్యాండిడేట్ అంటే.. కాదు నేనే’ అంటూ తన్నులాట మొదలైందని చెప్తున్నారు. ముఖ్యమంగా అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య ‘సీఎం కుర్చీ’ పోరు తీవ్రంగానే సాగుతున్నట్టు సమాచారం.
ఇంకా ముదిరిన సంక్షోభం
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించి కిషన్రెడ్డికి అప్పగిస్తూ.. పనిలో పనిగా ఎన్నికల నిర్వహణ కమిటీ అని ఓ కొత్త పోస్టును సృష్టించి దానిని ఎమ్మెల్యే ఈటల రాజేందర్కు అప్పగించింది పార్టీ అధిష్ఠానం. అప్పటిదాకా ఈటల వర్సెస్ బండి అన్నట్టుగా రెండు వర్గాలు ఉన్న పోరాటం కాస్తా.. అధ్యక్షుడి మార్పు తర్వాత మూడు ముక్కలాటగా మారిందని అంటున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని, తనకు కేంద్ర పెద్దల ఆశీస్సులు కూడా ఉన్నాయని కిషన్రెడ్డి తన వర్గం నేతలవద్ద చెప్తున్నట్టు సమాచారం. అదే సమయంలో ‘పార్టీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం మొత్తం నా చేతుల్లోనే ఉన్నది. పార్టీ గెలిస్తే నేనే సీఎం అవుతా’ అని ఈటల కూడా చెప్పుకొంటున్నట్టు తెలిసింది. వీళ్లిద్దరూ ఇలా పోటీ పడుతుండగా, మధ్యలోకి బండి కూడా వచ్చి చేరినట్టు పార్టీ వర్గాల సమాచారం. తనను అధ్యక్ష పదవి నుంచి తప్పించటంపై మండిపోతున్న బండి సంజయ్.. పార్టీలో తన వర్గాన్ని మరింత పెంచుకొనేందుకు సైలెంటుగా పావులు కదుపుతున్నట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం పదవి రేసులో తానే ముందుంటానని ఆయన కూడా చెప్పుకొంటున్నట్టు తెలిసింది. ముగ్గురు నేతల తన్నులాటతో పార్టీ మూడు ముక్కలు కావటంతో సగటు కార్యకర్తలు ఎవరి మాట నమ్మాలో అర్థంకాని డైలమాలో పడ్డట్టు చెప్తున్నారు.