హైదరాబాద్ : పోస్టుమార్టంపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఆదివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాత్రివేళ్లల్లోనూ పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన కొత్త మార్గదర్శకాలను ప్రభుత్వం రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నది. దేశవ్యాప్తంగా చట్టప్రకారం మృతదేహాలకు ఇప్పటివరకు కేవలం పగటిపూట మాత్రమే పోస్టుమార్టం చేసేందుకు అనుమతి ఉన్నది. దీంతో కొన్ని సందర్భాల్లో పోస్టుమార్టం కోసం గంటలతరబడి దవాఖానల్లోనే మృతదేహంతో నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది.
ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ప్రభుత్వం సాయంత్రం 6 గంటల తర్వాత పోస్టుమార్టం చేసేందుకు వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పోస్టుమార్టం చేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలున్న హాస్పిటళ్లలో 24 గంటలూ పోస్టుమార్టం చేసేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి అమలులో ఉన్న విధానానికి ఇప్పుడు స్వస్తి పలుకుతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలోనూ సూర్యాస్తమయం తర్వాత పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆదేశాలిచ్చింది.