హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ అక్రమాలకు అడ్డాగా మారుతున్నదని, ప్రభుత్వం కావాలనే నిబంధనలను తుంగలో తొకుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు. విద్యాశాఖలో ఎన్నడూ లేని విధంగా ఐఏఎస్ క్యాడర్ లేని అధికారిని కీలక పదవిలో కూర్చోబెట్టడం వెనుక భారీ అవినీతి సెచ్ ఉన్నదని ఆరోపించారు. సెక్రటరీ కార్యాలయంలో కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ఆరుగురు అధికారులను మార్చడం వెనుక అంతర్యమేమిటని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అలుగు వర్షిణి ఏడాదిపాటు పనిచేయగా, ఆమె స్థానంలో నియమించిన కృష్ణ ఆదిత్యను కూడా ఏడాదిపాటు పని చేయకుండానే తొలగించి విజయేంద్ర బోయి కి అప్పగించారని తెలిపారు. సెక్రటరీగా ఆమె చార్జి తీసుకోక ముందే మళ్లీ బదిలీ చేశారని, ఇప్పుడు ఐఏఎస్ లేదా గ్రూప్-1 అధికారి కూడా కాకుండా జాయింట్ సెక్రటరీ హోదా లో ఉన్న శారదను నియమించారని పేర్కొన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన బంకర్ బెడ్ల కొనుగోలు కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ప్రొ క్యూర్మెంట్ సిస్టమ్ను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. ఇది పారదర్శకత కోసం కాదని, కేంద్రీకృత లైసెన్సెడ్ లూటీ అని విమర్శించారు. సొసైటీల స్వయంప్రతిపత్తిని లాగేసుకొని, వేల కోట్ల రూపాయల విద్యార్థుల సరుకుల టెండర్లను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నియంత్రణలోకి తీసుకోవడం దారుణమని దుయ్యబట్టారు.
ప్రభుత్వానికి ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించే అనుభవజ్ఞుడైన ఐఏఎస్ అధికారి అవసరం లేదని, తమకు అనుకూలమైన పెట్టుబడిదారుల కోసం సంతకాలు పెట్టే ఒక రబ్బర్ స్టాం ప్ కావాలని శ్రవణ్ ఎద్దేవా చేశారు. అందుకే మ్యూజికల్ చైర్స్ ఆట ఆడుతున్నారని ఆరోపించారు. పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయాల్సిన ప్రజాధనాన్ని దోచుకోవడం నేరమని, దీనిపై స్టేట్ విజిలెన్స్ కమిషన్, ఏసీబీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.