హైదరాబాద్ : భవిష్యత్లో నా శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్తిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో అడుగులేస్తూ నవ భారత నిర్మాణం కోసం పని చేస్తాను అని టీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడారు. 2014, ఏప్రిల్ 12న ఆవేశంతోనో, అనాలోచితంగానో ఆ రోజు నేను కన్నతల్లి లాంటి.. నాకు రాజకీయంగా, సామాజికంగా, అస్తిత్వాన్ని, గుర్తింపు ఇచ్చి నన్ను సమాజంలో ప్రజలకు దగ్గర తెచ్చినటువంటి టీఆర్ఎస్ను వీడి ఆ రోజు వేరే పార్టీలో జాయిన్ అయ్యాను. దాదాపు ఏడు సంవత్సరాల ఎనిమిది నెలల తర్వాత నా సొంత ఇంటికి మళ్లీ రమ్మని నన్ను ఆహ్వానించి, సాదరంగా, ప్రేమగా, మా కుటుంబంలో ఒక సభ్యుడిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని చెప్పి ప్రేమతో ఆహ్వానం పలికినటువంటి మా అన్న రామన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వాస్తవానికి నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాన్ని. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఒక ఫినిక్స్ బర్డ్ వలే పార్టీని పునర్ నిర్మిస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా, కెరటంలా తీర్చిదిద్దుతున్న వైనాన్ని చూసి ప్రేరణ పొంది తెలంగాణ ఉద్యమంలో మమేకం కావాలని కేసీఆర్ అడుగుల్లో అడుగులేశాను. అలా తెలంగాణ ఉద్యమంలో మమేకమై పని చేశాను. ఉద్యమంలో కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని, ఉద్యమానికి ఒక గొంతుకగా పని చేసే అవకాశం కలిగింది. టీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా పని చేసే అవకాశం కల్పించారు.
కేసీఆర్ నేతృత్వంలో, దేశానికే తలమానికంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డది. మోడల్ డెవలప్మెంట్ను తెలంగాణ దేశానికి చూపుతోంది. దేశ వ్యాప్తంగా నిరూపయోగంగా ఉన్న వనరులన్నీ కూడా మళ్లీ వినియోగించబడాలి. మొత్తం భారతదేశం కూడా సమగ్రమైన అభివృద్ధి చెందాలని, వినూత్నమైన ఆలోచనలతో, దార్శనికతతో కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని జాతీయ పార్టీని ఆవిష్కరించారు. ఈ తరుణంలో వారితో కలిసి నడవాలని, నవ భారత నిర్మాణం కోసం కేసీఆర్ పడుతున్న శ్రమలో ఉడుతా భక్తిగా నేను కూడా పని చేయాలని భారత్ రాష్ట్ర సమితిలో చేరాను. ఇందుకు అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బీజేపీలోకి వెళ్లిన రెండున్నర నెలల్లోనే బయటకు ఎందుకు వచ్చాడని సందేహం ఉండొచ్చు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో బీజేపీలోకి వెళ్లాం. అక్కడ మూస రాజకీయాలు కనబడ్డాయి. మునుగోడు ఉప ఎన్నిక చూసినట్లు అయితే అక్కడ కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ప్రాతినిధ్యం వహించేలా క్షుద్ర రాజకీయం కొనసాగుతున్న వైనాన్ని చూసిన తర్వాత, నా లాంటి బలహీన వర్గాల నాయకులకు బీజేపీలో స్థానం లేదని కలత చెంది, పార్టీకి రాజీనామా చేశాను. భవిష్యత్లో నాకు శ్వాస ఉన్నంత వరకు, సామాజికంగా అస్తిత్వం కలిగించి, ప్రజలకు దగ్గరకు చేర్చి తెలంగాణ ఉద్యమానికి గొంతుకగా తీర్చిదిద్దిన కేసీఆర్కు అండగా ఉంటూ, వారి అడుగుల్లో అడుగులేస్తూ నవ భారత నిర్మాణం కోసం పని చేస్తాను అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.