హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి గోడం నగేశ్, కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రాజర్షిషాపై బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్కుమార్, ఆశిష్ శనివారం సీఈవో వికాస్రాజ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. గోడం నగేశ్ ఎన్నికల అఫిడవిట్లో పూర్తి వివరాలు నమోదు చేయలేదని, ఈ విషయంపై ఆర్వోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీఈవో దృష్టికి తెచ్చారు.
బీజేపీ అభ్యర్థి నామినేషన్ను తిరస్కరించి, రిటర్నింగ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా బీజేపీకి అనుకూలంగా పని చేస్తున్నదని దాసోజు శ్రవణ్ విమర్శించారు. నగేశ్ నామినేషన్ను తిరస్కరించడానికి ఆధారాలు చూపినా రిటర్నింగ్ అధికారి తిరస్కరించలేదన్నారు.