రవీంద్రభారతి, జూలై 22: నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి కృష్ణమాచార్యను బంధించిన నిజామాబాద్లోని ఖిల్లా జైలును పర్యాటక కేంద్రంగా మారుస్తామని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యర్థన మేరకు భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతి ప్రధాన వేదికపై దాశరథి కృష్ణమాచార్య 99వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్.. దాశరథి పురస్కారాన్ని పండిత కవి అయాచితం నటేశ్వరశర్మకు బహూకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అనాథలు, అన్నార్థులు లేని కాలం, కరువు కాటకాలు లేని రోజల గురించి దాశరథి కలలు కన్నారని.. స్వరాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో నేడు అవి సాకారం అవుతున్నాయని పేర్కొన్నారు. నేడు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కొందరు చూడలేక విద్వేష ప్రచారం చేస్తున్నారని.. వారికి దీటుగా కవులు, కళాకారులు రాష్ట్ర ప్రగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. సురవరం ప్రతాపరెడ్డి, దాశరథి, సీ నారాయణరెడ్డి, కాళోజీ నారాయణ మహానీయులు ఇక్కడ జన్మించి తెలంగాణ గడ్డకే వన్నె తెచ్చారని కొనియాడారు. అలాంటి వైతాళికుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని స్పష్టంచేశారు.
తెలంగాణకు ఆత్మీయ కవి దాశరథి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
తెలంగాణకు అత్యంత ఆత్మీయ కవి దాశరథి కృష్ణామాచార్యులు అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అభివర్ణించారు. సీఎం కేసీఆర్ను కృష్ణదేవరాయలతో పోలుస్తూ పురస్కార గ్రహీత అయాచితం నటేశ్వరశర్మ పాటలు పాడారు. ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ.. దాశరథి కృష్ణామాచార్యులు తెలంగాణకే వన్నె తెచ్చిన గొప్ప గేయ రచయిత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ, అధికారిక భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికారెడ్డి, గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్, సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యజ్వాల రగిలించిన మహాకవి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తన సాహిత్యంతో తెలంగాణ ప్రజల్లో చైతన్యజ్వాల రగిలించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కవిగా, రచయితగా, విద్యావేత్తగా సాహిత్య రంగంపై చెరగని ముద్ర వేసిన తెలంగాణ సాహితీ సౌరభమని కొనియాడారు. దాశరథి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఘన నివాళి అర్పించారు.
ప్రాతః స్మరణీయుడు దాశరథి ;మంత్రి హరీశ్రావు
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ప్రాతఃస్మరణీయుడు అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మలి దశ ఉద్యమానికీ ప్రేరణనందించిన గొప్ప వ్యక్తి అని హరీశ్రావు స్మరించుకొన్నారు. తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎకుపెట్టినారని ట్విట్టర్లో పేర్కొన్నారు.