హైదరాబాద్: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరం యోగా అని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. మహర్షి పతాంజలి అందించిన అష్టాంగ యోగా విద్యలే నేటి యోగాకు ప్రాణాధారమని చెప్పారు. యోగా కేవలం వ్యాయామానికి సంబంధించింది కాదని.. శరీరం, మనస్సు, ఆత్మను ఏకం చేసే అద్భుత సాధమన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, అధికారులు, విద్యార్థులు సుమారు 5 వేల మందికిపైగా పాల్గొని యోగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. ప్రస్తుతమున్న ఉరుకుల పరుగుల జీవన శైలితో బీపీ, షుగర్, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలు రోజు రోజుకూ పెరుగుతున్నాయన్నారు. కోట్లు సంపాదించేవారికి కూడా ప్రశాంతత ఉండడం లేదని తెలిపారు. ఇలాంటి సమస్యలన్నింటికీ యోగా చక్కని పరిష్కార మార్గమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు.
యోగా చేయడానికి కావాల్సిందల్లా సంకల్పం, మంచి గురువని చెప్పారు. రోజూ యోగా చేయడం వల్ల మానసిక ప్రశాతంత, శారీరక దృఢత్వం, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. యోగాను ప్రోత్సహించేందుకు 630 మంది యోగా గురువులను నియమించామని తెలిపారు.
మరో 264 మంది యోగా గురువుల నియామక ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హెల్త్ సబ్సెంటర్లలో రోజూ ఉదయం యోగా క్లాసులు నిర్వహిస్తుమని వెల్లడించారు. గతేడాది కాలంలో కొత్తగా 5 లక్షల మందికి యోగా నేర్పించామని, అన్ని విద్యా సంస్థల్లో యోగా నేర్పించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. నేచురోపతి, యోగిక్ సైన్సెస్లో పీజీ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలకు యోగాను చేరువచేస్తామని తెలిపారు.
గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. యోగా కార్యక్రమంలో హైదరాబాద్లోని వివిధ పాఠశాలలు, కాలేజీల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత టిఫిన్ కోసం విద్యార్థులు ఫుడ్ స్టాల్స్ వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు. దీంతో గేట్ నంబర్ 2 వద్ద తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఇందులో ఓ అమ్మాయి అపస్మారక స్థితికి వెళ్లడంతో ఆమెను అంబులెన్స్లో దవాఖానకు తరలించారు.