హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణంగా తగిన పోస్టులో నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది. కారుణ్య నియామకం కింద వరంగల్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులో నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆయన కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే.
సైనికులపై, వారి కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి అవ్యాజమైన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గల్వాన్ లోయలో చైనా కుట్రకు బలైపోయిన కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే అంతేకాకుండా గల్వాన్ లోయలో అమరులైన ఇతర రాష్ట్రాల జవాన్ల కుటుంబాలను సైతం ఆదుకొన్నారు. స్వయంగా జార్ఖండ్, చండీగఢ్ ప్రాంతాలకు వెళ్లి.. అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అమర జవాన్ల కుటుంబాలకు ఇతర రాష్ట్రాలూ సహాయం చేశాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మా త్రం భావోద్వేగ నినాదాలు ఇవ్వడం తప్ప ఆర్థికంగా, హార్థికంగా అమరజవాన్ల కుటుంబాలను ఆదుకొన్నది లేదు. సాధారణంగా సైనిక విధానాల ప్రకారం వారికి హక్కుగా రావలసినవి వచ్చాయే తప్ప మోదీ సర్కారు పైసా సాయం చేసింది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పూనుకొని.. దేశ సరిహద్దుల్లో మనకు రక్షణగా నిలిచే జవాన్ల కుటుంబాలకు కుటుంబపెద్దగా నిలిచి తన ఔదార్యాన్ని చాటుకొన్నారు.