హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): వర్షాలతో రాష్ట్రంలోని రోడ్లకు సుమారు రూ.820 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్అండ్బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర రహదారులకు దాదాపు రూ.674 కోట్ల నష్టం జరుగగా, జాతీయ రహదారులకు సుమారు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. నష్ట వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది. తక్షణ మరమ్మతుల కోసం రూ.46 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేయగా, వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 1,323 కి.మీ. మేర రాష్ట్ర రహదారులకు నష్టం జరిగింది. కొన్నిచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకపోగా, మరికొన్ని చోట్ల బీటీ కొట్టుకపోయి కంకర తేలింది. భవిష్యత్తులో ముంపునకు గురికాకుండా దిగువ ప్రాంతాల్లో (లో లైయింగ్ ఏరియాలు) రోడ్లను అభివృద్ధికి రూ.85 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు.