హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ఆనకట్టల రక్షణ కోసం ప్రపంచబ్యాంకు నిధులతో ప్రతిపాదించిన డ్యామ్ రిహాబిలిటేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్టు (డ్రిప్)లో భాగంగా వేసిన డ్యామ్ సేఫ్టీ ప్యానెల్ వరుసగా ఒక్కో ప్రాజెక్టును సందర్శిస్తున్నది. అందులో భాగంగా చైర్మన్ గంజు అశోక్కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం నిర్మల్ జిల్లా గడ్డెన్నవాగు ప్రాజెక్టును సోమవారం సందర్శించింది. డ్యామ్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? లీకేజీలు ఉన్నాయా? లేవా? తదితర అంశాలను ఈ బృందం సమగ్రంగా పరిశీలించింది.
ప్రాజెక్టు గ్యాలరీ, కుడి-ఎడమ మట్టికట్టలు, 8 గేట్లతోపాటు ఓటీ స్లూయిస్లు, స్పిల్వేను పరిశీలించారు. ప్రాజెక్టును సందర్శించిన టీమ్లో డ్రిప్ నోడల్ అధికారి, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, డ్రిప్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం సత్యనారాయణరెడ్డి, గడ్డెన్నవాగు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్రెడ్డి, డ్రిప్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రఘునాథశర్మ, డీఈఈ సతీశ్ తదితరులున్నారు. నేడు ఈ బృందం సాత్నాల, స్వర్ణ ప్రాజెక్టులను సందర్శించనుంది. డ్రిప్ పథకంలో తెలంగాణ ప్రభుత్వం 29 ప్రాజెక్టులను చేర్చగా.. అందులో ఇప్పటివరకు ఆరు ప్రాజెక్టులను ఈ డ్యామ్ సేఫ్టీ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది.