హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రధాన డ్యాముల పరిరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 184 డ్యామ్లు ఉన్నాయని గుర్తించిన స్టేట్ కమిటీ ఆయా ఆనకట్టలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించాలని అధికారులకు సూచించింది. డ్యామ్ సేఫ్టీ స్టేట్ కమిటీ చైర్మన్, రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ (జనరల్) అధ్యక్షతన వర్చువల్ విధానంలో బుధవారం మొదటిసారిగా ఈ కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా ఆనకట్టల రక్షణకు సిఫారసులు చేయాలని సమావేశానికి హాజరైన జేఎన్టీయూ, ఉస్మానియావర్సిటీకి చెందిన నిపుణులను ఈఎన్సీ కోరారు. సమావేశంలో ఈఎన్సీలు నాగేంద్రరావు, నాగార్జునసాగర్ సీఈ శ్రీకాంతరావు, ఏపీ, కర్ణాటక సీఈలతో పాటు, సీడబ్ల్యూసీ డైరెక్టర్ నిత్యానందరాయ్, సీడీవో సీఈ, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రతినిధులు జడ్ శ్రీనివాసరావు, ఎస్ఈ మురళీకృష్ణ, ఈఈ రఘునాథశర్మ, డీఈఈ సతీశ్ తదదితరులు పాల్గొన్నారు.