హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నది. ఇప్పటికే విద్యాహక్కు, జీఎస్టీ ద్వారా రాష్ర్టాలను తన గుప్పిట్లో పెట్టుకొన్న కేంద్రం.. విద్యుత్తును కూడా తన చేతుల్లోకి తీసుకొనేందుకు రంగం సిద్ధం చేసుకొన్నది. తాజాగా, సాగు నీటి రంగంపై కన్నేసింది. నీటిని సైతం ప్రైవేటుపరం చేసే దిశగా మూడు చట్టాలను రూపొందించింది. నేషనల్ వాటర్ పాలసీ, రివర్ మేనేజ్మెంట్తో పాటు డ్యామ్ సేఫ్టీ బిల్లులను తెరమీదకు తీసుకొచ్చింది. ఇందులో డ్యామ్ సేఫ్టీ బిల్లును కేంద్రం తాజాగా ఆమోదింపచేసుకొన్నది.
డ్యామ్ సేఫ్టీ బిల్లు అమల్లోకి వస్తే 15 మీటర్ల ఎత్తు ఉన్న ప్రతీ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోకి పోతుంది. ఈ లెక్కన రామప్ప, లక్నవరం, పాకాల, గణప సముద్రం, నిజాంసాగర్, ఉస్మాన్సాగర్, గండిపేట వంటి అనేక మైనర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. అదేవిధంగా 10 మీటర్ల ఎత్తు ఉండి, క్రస్ట్ గేట్ల వెడల్పు 500 మీటర్లు ఉన్న ప్రతి ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా పరిగణిస్తారు. ఈ బిల్లు వల్ల రాష్ట్రంలోని 185 ప్రాజెక్టులు కేంద్ర పరిధిలోకి వెళ్లే అవకాశం ఉన్నది.
సాగునీటి అంశం రాష్ట్ర జాబితాలోనిది. దీన్ని కేంద్రం లాగేసుకోవటం సమాఖ్యస్ఫూర్తికి విరుద్ధం. అదీగాక నీటిని ప్రైవేటుపరం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అందులో భాగంగానే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. డ్యామ్ల నిర్వహణ, పర్యవేక్షణను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నది. సాగునీటి రంగం కేంద్రం ఆధీనంలోకి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. మన తాగునీటి, సాగునీటి అవసరాలను సకాలంలో తీర్చుకోలేని పరిస్థితి. కేంద్రం రాష్ర్టాలకు మార్గదర్శకంగా ఉండాలి తప్ప హక్కులను లాగేసుకోవటం అప్రజాస్వామికం.
–వీ ప్రకాశ్, తెలంగాణ జలవనరుల అభివృద్ధిసంస్థ చైర్మన్
కేంద్ర ప్రభుత్వం నీటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పటికే తెలంగాణ, ఏపీకి చెందిన ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకొంటున్నది. ఇదే తరహాలో దేశంలోని మొత్తం సాగునీటి ప్రాజెక్టులను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తున్నది. ఇది ప్రమాదకరం. సాగునీటి కోసం ఇక నుంచి కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిందే. డ్యామ్ల మరమ్మతులు చేపట్టాలన్నా కేంద్రం అనుమతులు తప్పనిసరి. దీన్ని ప్రతీఒక్కరు వ్యతిరేకించాలి.
శ్యాం ప్రసాద్రెడ్డి, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి