తరతరాలుగా వెంటాడుతున్న వివక్ష.. అణచివేత, అసమాన అవకాశాలు.. అందుబాటులో లేని విద్య.. వెరసి సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో వెనుకబాటుతనం. ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని ఉమ్మడి ఏపీలో దశాబ్దాలుగా పోరాటాలు సాగాయి.
అనేక ఒత్తిళ్లకు తలొగ్గిన ఉమ్మడి రాష్ట్రంలోని చివరి ప్రభుత్వం 2013లో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని రూపొందించింది. కానీ అది పేరుకే, పేపరుకే పరిమితమైంది. అమలులో అడుగు ముందుకుపడని దుస్థితి. మళ్లీ అదే నిర్లక్ష్యం. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించినట్టు కనపడినా.. ఆచరణలో రవ్వంత కూడా ఖర్చు చేయని దుస్థితి. పైగా ఆ నిధుల దారిమళ్లింపులు. ఇదీ ఎస్సీ, ఎస్టీలను నాటి ప్రభుత్వాలు వంచిస్తూ వచ్చిన విధానం.
తెలంగాణ ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలు సత్వర అభివృద్ధిని సాధించేందుకు ఆర్థిక, విద్య, మానవ అభివృద్ధికి విశేష ప్రాధాన్యమిచ్చారు. షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలకు భద్రత, సమాజంలో గౌరవం పెంపొందించి సమానత్వ సాధనే లక్ష్యంగా, గత చట్టానికి భిన్నంగా తెలంగాణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి (ప్రణాళిక, కేటాయింపు, ఆర్థిక వనరుల వినియోగం) చట్టం 2017ను పకడ్బందీగా రూపకల్పన చేశారు. అట్టడుగు వర్గాలు అభ్యున్నతి చెందనంత కాలం సమాజం పురోగమించదన్న కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ చట్టాన్ని సవరించి దేశానికే ఆదర్శంగా నిలిచింది.
హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్రం మొత్తం ప్రగతిపద్దు వ్యయంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు నిధులను కేటాయిస్తున్నారు. అక్కడితోనే ఆగకుండా ఆ నిధులు పక్కదారి పట్టకుండా పకడ్బందీ నిబంధనలను రూపొందించారు. నిధుల ఖర్చుకు గత చట్టంలో 10 ఏండ్ల కాలపరిమితి ఉండగా.. తెలంగాణ ఎస్డీఎఫ్ చట్టంలో ఆ పరిమితిని తొలగించారు. ఉమ్మడి జనాభా స్థానంలో.. ‘40 శాతానికి తక్కువకాని ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీ జనాభా’ అని జనావాసాన్ని నిర్వచించారు. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించని నిధులను తరువాతి ఆర్థిక సంవత్సరంలో వినియోగించుకునేలా నష్ట పరిహారం రూపంలో నిబంధనను కూడా చేర్చా రు.
అదేవిధంగా అధికార, అధికారేతర సభ్యులతో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్రస్థాయిలో కమిటీని, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రి నేతృత్వంలో నోడల్ ఏజెన్సీ, కలెక్టర్లు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీల నేతృత్వంలో జిల్లాస్థాయిలో కమిటీలు, అమలు పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయిలో కమిటీని ఏర్పాటు కూడా చేయడం విశేషం. ఇక మొత్తంగా చట్టం అమలులోకి వచ్చిన నాటినుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,08,754.54 కోట్లను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు కేటాయించడం మరో విశేషం. దేశవ్యాప్తంగా పలువురు పార్లమెంటేరియన్లు, శాసనకర్తలు తెలంగాణ అమలు చేస్తున్న నమూనాను తమ తమ రాష్ర్టాల్లోనూ అనుసరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్, ఒడిశా వంటి రాష్ర్టాలు తమ అసెంబ్లీల్లో చట్టాలు సవరించుకోవడం తెలంగాణకు గర్వకారణం.
దళిత, గిరిజన సముద్ధరణకు..
సమైక్య రాష్ట్రంలో 2014 వరకు తెలంగాణలో ఒక్కొక్కరికి సగటున 1.21 ఎకరాల చొప్పున 32,800 మందికి 39,798 ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీచేసినట్టు రికార్డుల్లో ఉంది. స్వరాష్ట్రంలో 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వ్యవసాయాధారిత ఎస్సీ కుటుంబాలకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 768.94 కోట్లను వెచ్చించి భూమిని కొనుగోలు చేసి.. 6,995 కుటుంబాలకు 17,096.31 ఎకరాలను పంచింది.
ఎస్సీ, ఎస్టీ నివాస గృహాలకు గతంలో 50 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం 101 యూనిట్లకు పెంచింది. అంతేకాకుండా 19.30 లక్షల ఎస్సీ ఇండ్లకు 253 కోట్లను, లక్ష ఎస్టీ ఇండ్లకు 193 కోట్లను రాయితీగా అందిస్తున్నది.
ఇప్పటివరకు 1,62,444 మంది ఎస్సీలకు 2,029.78 కోట్లను, 20,888 ఎస్టీలకు 135 కోట్లను సబ్సిడీ రుణాలుగా అందజేసింది.
ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో దళిత, గిరిజన యువతకు నైపుణ్య శిక్షణను అమలుచేస్తూ వారికి బాసటగా నిలుస్తున్నది తెలంగాణ సర్కారు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే 104.62 కోట్లను ఖర్చుపెట్టి.. 17,240 మందికి శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందినవారు లక్షల్లో ప్యాకేజీతో కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతుండడం విశేషం.
దళిత, గిరిజనుల వ్యవసాయ భూముల అభివృద్ధికి, సాగునీరు, విద్యుత్తు కల్పనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నది.
ఎస్సీ కాలనీల్లో గ్రామపంచాయతీల్లోనైతే 7.50లక్షలతో, మండలస్థాయిలో 25 లక్షలు, మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్లో 50లక్షలు, జిల్లాస్థాయిలో కోటితో కమ్యూనిటీ హాళ్లను, అంబేద్కర్ భవనాలను నిర్మిస్తున్నది. ఇప్పటివరకు 15 అంబేద్కర్ భవనాలను, 893 ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు మంజూరు చేసింది. బంజారాహిల్స్లో 11.57 కోట్లతో బాబు జగ్జీవన్ రామ్ భవనాన్ని నిర్మించింది.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సంక్షేమ నిధిని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యతోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపే ఎస్సీ,ఎస్టీలకు ఆర్థిక సాయం అందిస్తుంది. అందుకు అవసరమైన వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది.
కులాంతర వివాహాలు చేసుకున్న జం టలకు 2.50 లక్షలను అందిస్తున్నది. 2018 నుంచి ఇప్పటివరకు 2,540 జంటలకు 13.17 కోట్ల ప్రోత్సాహాకాన్ని అందజేసింది.
ఎస్సీలు, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తూ, రాయితీలు కల్పిస్తున్నది. రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎస్సీలకు 15.44 శాతం, ఎస్టీలకు 9.34 శాతం స్థలాలను రిజర్వ్ చేయడం ద్వారా కేసీఆర్ ప్రభు త్వం దేశంలో రికార్డును సృష్టించింది. ఎకరం స్థలంలో రూ. 5 కోట్లతో ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వమే రూ.5 కోట్ల వరకు మార్జిన్మనీ కింద అందిస్తున్నది.
ఎస్సీ, ఎస్టీ వర్గాల ఔత్సాహికులకు స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ ఎస్సీ అంత్రప్రెన్యూర్స్ (టీ-ప్రైడ్) అనే వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీలు స్థాపిం చే పరిశ్రమలకు ఒక్కో యూనిట్కు ఇచ్చే విద్యుత్తు సబ్సిడీని రూపాయిన్నరకు పెంచింది. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ద్వారా పరిశ్రమల స్థాపనకయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీని గరిష్ఠంగా రూ.75 లక్షల వరకు అందజేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే సబ్సిడీని 10% పెంచి, ప్రస్తుతం 45% ఇస్తున్నారు. సేల్స్ట్యాక్స్ మినహాయింపును 50 నుంచి 100 శాతానికి పెంచారు. టీ-ప్రైడ్ ద్వారా 2,467 మంది ఎస్సీలకు 112.79 కోట్లు, 1,929 మంది ఎస్టీలకు 87.21 కోట్లు మంజూరుచేశారు. వారికి ప్రభుత్వం 338 కోట్ల పారిశ్రామిక రాయితీలను అందించింది.
ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఎస్సీ, ఎస్టీలకు శిక్షణనిచ్చి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనులు అప్పగించేందుకు రిజర్వేషన్ కల్పించింది తెలంగాణ. అదేవిధంగా మెడికల్ షాపులు, వైద్యశాలలకు భోజనం సరఫరా చేసే ఏజెన్సీల్లో, మద్యం షాపుల్లో, ఎరువుల దుకాణాల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నది.
గిరిజన అంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎం ఎస్టీఈఐ) పథకాన్ని ప్రారంభించి వందలాది మంది గిరిపుత్రులను యువపారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నది. ఏటా 100 మంది చొప్పున ఎంపికచేసి వారికి వ్యాపార, పారిశ్రామిక మెళకువలు నేర్పిస్తున్నది. ఇప్పటికే వందలమందిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దింది. వారు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు.
దళితబంధు మకుటాయమానం
దళితుల సముద్ధరణ, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రూపకల్పన చేసి అమలు చేస్తున్న దళితబంధు పథకం సంక్షేమ పథకాలన్నింటికీ మకుటాయమానంగా నిలుస్తున్నది. గత ప్రభుత్వాలు దళితుల అభ్యున్నతికి అమలు చేసిన పథకాల్లా కాకుండా, వాటికి భిన్నంగా ఎలాంటి షరతులు లేకుండా, బ్యాంకులతో సంబంధం లేకుండా దళితులు తమకు నచ్చిన, వచ్చిన ఉపాధి మార్గాన్ని, నచ్చిన చోట ప్రారంభించుకునేందుకు ఏకమొత్తంగా రూ.10 లక్షల ఆర్థికసాయాన్ని అందజేస్తూ వారి అభ్యున్నతికి సర్కారు కొత్త బాటలు వేస్తున్నది. 2021 ఆగస్టు 4న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. 72 కుటుంబాలను పైలట్గా ఎంపిక చేసి రూ.10 లక్షల చొప్పున అందజేశారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఈ పథకం లక్ష్యం దిశగా పరుగులు తీస్తున్నది. దళితబంధు పథకం దళిత జీవితాల్లో వెలుగులు నింపుతూ నిర్విఘ్నంగా ముందుకుసాగుతున్నది. వాసాలమర్రి తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు పాలేరు నియోజకవర్గంలో చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి, సూర్యపేట నియోకవర్గంలోని చారుగొండ, జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో అమలు చేసింది. ఆ తర్వాత పథకాన్ని మొత్తంగా 118 నియోజకవర్గాలకు విస్తరించింది. నియోజకవర్గానికి 100 మందికి చొప్పున మొత్తం 11,800 మందికి పథకాన్ని వర్తింపజేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.4 వేల కోట్లను దళితబంధు కోసం కేటాయించగా.. ఈ ఏడాది బడ్జెట్లో ఏకంగా రూ.17,700 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వచ్చే సంవత్సరాంతానికి 2 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు దళితబంధు ప్రయోజనాలు అందివ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.
విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యం
(నోట్: మొత్తంగా ఇప్పటివరకు దళితబంధు స్కీం కింద దాదాపు 92 రకాలైన యూనిట్లను లబ్ధిదారులు ఎంచుకున్నారు. అందులో 80శాతం మంది తాము ఇప్పటివరకు చేస్తున్న వృత్తులకు సంబంధించిన యూనిట్లను ఎంచుకోవడం, చిన్నగా ఉన్న షాపులను విస్తరించుకోవడం చేశారు.)