ముషీరాబాద్, ఆగస్టు 11: వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాటను నిలబెట్టుకోవాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. వర్గీకరణ హామీ నిలబెట్టుకోకపోతే మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ఓటువేయబోమని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ గురువారం ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు దళిత సంఘాల నేతలు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు కొక్కెర భూమన్న, ఎస్సీ ఉప కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు చింతల రాజలింగం, మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు ఎం మల్లేశ్ మాదిగ, వాల్మీకి మేదర సఫాయి కర్మచారి సంఘం అధ్యక్షుడు అజిత్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి నా.. పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడ్డారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.