హైదరాబాద్: దళితబంధు (Dalitha Bandhu) నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాభవన్ వద్ద ధర్నకు దిగారు. రెండో విడుత దళితబంధుకు ఎంపికైనవారి ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేవంత్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దళితులపై ముఖ్యమంత్రి రేవంత్ విక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యిచ్చిందంటూ విమర్శించారు. సుమారు 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
దళితులు స్వయం ఉపాధితో అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడుతలో 38,323 దళిత కుటంబాలకు రూ.10 లక్షల చొప్పున బీఆర్ఎస్ సర్కార్ రూ.4,441.8 కోట్లు మంజూరు చేసింది. గతేడాది అక్టోబర్ 2న రెండో విడుత కార్యక్రమాన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. రెండో విడుత దళిత బంధు కోసం 2023-24 బడ్జెట్లో గత ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది.
హుజూరాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాలలో.. ఒక్కో నియోవర్గంలో 1100 కుటుంబాలకు ఎంపిక చేసి మొత్తం 1.30 లక్షల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అర్హులను కూడా ఎంపిక చేసింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో లబ్ధిదారులకు నిధుల పంపిణీ నిలిచిపోయింది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో రావడంతో.. దళితబంధు పథకం నిలిచిపోయింది. దీంతో బాధితులు గత 8 నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ కాళ్లరిగేలా తిరిగుతున్నారు. అయితే ప్రభుత్వం కరుణించడంలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.