యాదాద్రి భువనగిరి(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులకు కూడా దళిత బంధు వర్తిస్తుంది. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకూ ఈ పథకం వర్తిస్తుంది. వీరంతా చివరి వరుసలో తీసుకోవాలని కోరుతున్నా. అది సామాజికంగా మన బాధ్యత. -సీఎం కేసీఆర్ తెలంగాణలో దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రైతు బంధు తరహాలోనే..దళిత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాలో తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ఈ పథకాన్ని త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని అర్హులైన వారందరికీ దళిత బంధు పథకం ద్వారా నేరుగా సాయం అందించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులతోపాటు, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకూ దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన దళిత ఉద్యోగ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది.
ఈ పథకంలో బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా ఉద్యోగుల కుటుంబాలకూ రూ.10లక్షల నగదు సాయం అందనుం ది. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఆయా వర్గాల్లో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలుతో సబ్బండ వర్ణాల అభివృద్దికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషితో దళితుల జీవితాలు కూడా మెరుగు పడుతూ వస్తున్నాయి. అయితే సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాల కాలంగా వివక్షతకు గురవుతూ వస్తున్న దళిత కుటుంబాలను ప్రత్యేక శ్రద్ద పెట్టి బాగు చేసుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ విప్లవాత్మక రీతిలో కార్యాచరణను అమలు చేయాలని సంకల్పించారు.
దళితులను పేదరికం నుంచి బయడపడేసేందుకు దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గంలో, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కార్యాచరణ మొదలైంది. తదుపరి రాష్టవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ దళిత బంధు పథకాన్ని అమలుచేయనున్నారు.
దళిత ఉద్యోగులకూ రూ.10లక్షల సాయం
రాష్ట్ర వ్యాప్తంగా 17లక్షల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఇప్పటికే యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాల మర్రి గ్రామానికి చెందిన 76 కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున అందించేందుకు రూ.7.60కోట్లను జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసి ఉంచారు. హుజూరాబాద్ నియోజక వర్గానికి రూ.500కోట్లు మంజూరు చేశారు. పథకం అమలును పర్యవేక్షించడం, ఆతర్వాత ఫలితాలను అంచనా వేయడం, లబ్దిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం వంటి మూడు ముఖ్యమైన అంశాల ఆధారంగా దళిత బంధు పథకాన్ని అమలు చేసేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు.
ఎలాంటి బ్యాంకు లింకేజీతో సంబం ధం లేకుండా రూ.10లక్షల చొప్పున నగదు సహాయాన్ని పూర్తి గ్రాంటు రూపంలో అందజేయనున్నారు. రైతు బంధు తరహాలో దలిత బంధు లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా ఆర్థికసాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ వేదికగా చేసిన ప్రకటనతో దళిత బంధు సాయం దళిత ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకూ అందనుంది.
దళిత బంధుతో లబ్దిపొంది ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం ఏదైనా పరిస్థితిలో ఆపదకు గురైతే రక్షణ నిధి ద్వారా ఆ కుటుంబాన్ని దీనస్థితి నుంచి బయటపడేసేలా దళిత బంధు పథకానికి కార్యరూపం ఇస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని త్వరలోనే యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమ లు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులైన దళితులు, రిటైర్డ్ ఉద్యోగుల్లో అర్హులైన వారందరికీ చివరి వరుసలో సాయం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.
దళిత ఉద్యోగుల కుటుంబాల్లో వెల్లువెత్తుతున్న సంతోషం
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అమలు చేయ సంకల్పించిన దళిత బంధు పథకం పట్ల జిల్లాలోని దళిత ఉద్యోగ కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దళిత మేధావులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. దళితుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం నాంది పలుకుతుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆర్థిక సంక్షోభంలోనూ దళిత జాతి అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకోవడం హర్షణీయమని కొనియాడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు సీఎం కేసీఆర్ తపన అమోఘమని, దళిత సమాజం ఆయనకు ఎల్లవేళలా రుణపడి ఉంటుందని దళిత ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి.