కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి/కరీంనగర్ రూరల్/నర్సాపూర్/ఆసిఫాబాద్, మే 16: రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్లో గిరిజన వర్కింగ్ మహిళా హాస్టల్ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను అందజేశారు. అనంతరం కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్దుంపూర్లో నిర్మించిన 40 డబుల్ బెడ్రూం ఇండ్ల్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేసి గృహప్రవేశం చేయించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఆయాచోట్ల మంత్రి గంగుల మాట్లాడుతూ.. దళిత బంధు పథకం ద్వారా ఎంతోమంది దళితులు యజమానులుగా మారుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జడ్పీ చైర్పర్సన్ విజయ, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, మేయర్ వై సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని సాయికృష్ణ గార్డెన్లో నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాల దళిత కుటుంబాలకు చెందిన 36 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరి యాదవరెడ్డి, రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన పది మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను జిల్లా కేంద్రంలో సోమవారం జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు అందజేశారు.