రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సుదీర్ఘ పోరాట ఫలితంగా సిద్ధించిన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఉద్ఘాటించారు. నిరుపేద దళితబిడ్డల ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సర్కారు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రభాగాన నిలిపేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్నామని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాలతో అటు రైతన్న, ఇటు నేతన్నకు దన్నుగా నిలుస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి వారినుద్దేశించి ప్రసంగించారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో దళితుల బతుకులు మారలేదని, అందుకే వారి బతుకుల్లో వెలుగులు నింపే లక్ష్యంతో దళితబంధును అ మలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ పథకానికి వచ్చే బడ్జెట్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లను కేటాయించే సంకల్పంతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని చెప్పారు. యావత్ భారతావనికే తలమానికంగా నిలిచేలా 2018లో రైతుబంధుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డె, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు, జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ సాబ్.. మెల్లగా రండి: మంత్రి కేటీఆర్
స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్తమ ఉద్యోగిగా దివ్యాంగ డాక్టర్ శ్రీరామ్ తన ప్రశంసా పత్రాన్ని అందుకునేందుకు వస్తుండగా నడవలేక ఇబ్బంది పడుతుండటాన్ని మంత్రి కేటీఆర్ గమనించి తాను ఉన్న చోట నుంచి కిందికి దిగారు. ‘డాక్టర్ సాబ్ మెల్లగా రండి.. పర్వాలేదు నేనే కిందికి వస్తున్నా’నంటూ మంత్రి కేటీఆర్ ఎదురు వెళ్లే క్రమంలో.. ‘పర్వాలేదు సార్ నేనే స్టేజీ మీదికి వస్తాను’ అని అంటుండగానే మంత్రి కేటీఆర్ స్వయంగా తన చేయి అందించి వేదికపై తీసుకొచ్చి ప్రశంసాపత్రాన్ని అందించారు. మంత్రి చొరవను పలువురు మెచ్చుకున్నారు.
దిగులుపడకు.. అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటింటా ఇన్నోవేటర్లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రదర్శనను తిలకించారు. వేములవాడ మండలం హన్మాజిపేట హైస్కూల్లో పదోతరగతి చదువుతున్న కీర్తన ఉపాధ్యాయుడు వెంకటేశ్ సహకారంతో కొవిడ్ 19 గొడుగును తయారు చేసింది. కీర్తనతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ ఆమె కుటుం బ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. తన తండ్రి ఎల్లయ్య ఇటీవల కొవిడ్తో మృతి చెందాడని తల్లి కవిత బీడీలు చుడుతూ తనను పోషిస్తుందని వివరిస్తూ తమకు ఉండేందుకు ఇల్లు కూడా లేదని ఆవేదన చెందింది. చలించిపోయిన మంత్రి కేటీఆర్ అక్కడే ఉన్న కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో శ్రీనివాసరావుకు ఉజ్వలమైన భవిష్యత్తు గల కీర్తనకు ఆర్థిక సాయం అందిస్తూ ఎక్కడైన భూమి ఇవ్వాలని ఆదేశించారు.