హైదరాబాద్ : దళితబంధు పథకం ఓ గొప్ప సామాజిక ఉద్యమమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. సమాజంలో అనాదిగా అణగారిన దళితజాతి అభ్యున్నతికి పాటుపడడమే ధ్యేయంగా, దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో పథకాన్ని సామాజిక ఉద్యమంగా అమలు పరుచుకుంటున్నామన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడారు. ‘దళితులను ఆర్థికంగా బలోపేతంచేసి, సామాజిక వివక్ష నుంచి వారికి విముక్తి కల్గించాలని, దళితులంతా స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆ లక్ష్య సాధనకోసం నేనే స్వయంగా దళితబంధు పథకానికి రూపకల్పన చేశాను. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఇది రుణం కాదు. తిరిగి చెల్లించే పనిలేదు. పూర్తి గ్రాంట్గా ప్రభుత్వం అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడితో తమకు నచ్చిన వచ్చిన పనిని లబ్దిదారుడు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు.
కొందరు లబ్ధిదారులు సమూహంగా ఏర్పడి కూడా వ్యాపార ఉపాధి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ విషయంలోనూ లబ్ధిదారుడిపై ఎలాంటి ఆంక్షలు విధించకపోవడమే ఈ పథకం గొప్పతనం. దళితబంధు పథకం కింద ఇప్పటికే చాలామంది దళితులు స్వయం ఉపాధిమార్గాన్ని చేపట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళితబంధు పథకం ద్వారా అందించే ఆర్థిక సాయానికి అదనంగా ప్రభుత్వం లబ్ధిదారుల భాగస్వామ్యంతో ‘దళిత రక్షణ నిధి’ కూడా ఏర్పాటు చేస్తున్నది. దళితబంధు ద్వారా లబ్ధిపొందిన కుటుంబం కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే, ఆ కుటుంబం ఆ ఆపద నుంచి తేరుకొని తిరిగి ఆర్థికంగా, మరింత పటిష్టంగా నిలదొక్కుకోవడానికి ఈ నిధి దోహదపడుతుంది.
దీంతో పాటుగా, దళితబంధు లబ్ధిదారులు వివిధ వ్యాపార రంగాల్లోపైకి ఎదిగేందుకు వీలుగా, ప్రభుత్వ లైసెన్సులు పొంది ఏర్పాటు చేసుకొనే లాభదాయక వ్యాపారాలైన మెడికల్ షాపులూ, ఫెర్టిలైజర్ షాపులూ, వైన్ షాపులూ, హాస్టళ్ళూ, హాస్పిటళ్ళకు సరఫరా చేసే, వివిధ రకాల కాంట్రాక్టుల్లో ప్రభుత్వం దళితులకు పదిశాతం రిజర్వేషన్లను అమలుచేస్తున్నది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 2,616 వైన్ షాపుల్లో 261 షాపులు దళితులకు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా దళితులందరికీ దశలవారీగా దళితబంధు ప్రయోజనాన్ని ప్రభుత్వం అందజేస్తుంది. ఈ ఏడాది దళితబంధు అమలు
కోసం బడ్జెట్లో రూ.17,700కోట్ల కేటాయించింది. ప్రభుత్వం ఉత్తమ లక్ష్యంతో, మహోన్నత ఆశయంతో, ఉద్యమ స్ఫూర్తితో అందిస్తున్న పథకాన్ని లబ్ధిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’నన్నారు.
‘గూడు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను తీర్చడమే కాకుండా గౌరవ ప్రదమైన నివాసాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. దేశంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రభుత్వం ఇప్పటివరకు 2.91లక్షల ఇండ్లు మంజూరు
చేసింది. ఇందుకోసం రూ.19,126కోట్ల కేటాయించింది. స్వంత స్థలం కలిగిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణానికి దశలవారీగా రూ.3లక్షల మంజూరు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇది నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారునికి అందే వరకూ పథకం అమలవుతుంది’ అని వివరించారు.